మాచారెడ్డి/కామారెడ్డి, ఏప్రిల్ 24 : అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని, అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మద్దతుగా కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా, ఎక్స్రోడ్లో బుధవారం నిర్వహించిన రోడ్ షోకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాసంగి పెట్టుబడి సాయం డబ్బులు రైతులకు ఇప్పటిదాకా అందలేదన్నారు. అడిగితే చెప్పుతో కొడతామంటూ రైతులను కాంగ్రెస్ నేతలు అవమాన పర్చారని గుర్తుచేశారు.
4 వేల రూపాయల ఫించన్ ఏమయ్యిందని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాట్లు వేసేముందే రైతుబంధు ఇచ్చామని, ధాన్యం కొన్న వారం రోజుల్లో రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను జమచేశామని అన్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారమే ఫించన్లను పెంచి పంపిణీ చేశామని, మన బతుకులు మార్చే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని అన్నారు. పదేండ్లు ఎంపీగా ఉన్న బీబీపాటిల్ కామారెడ్డికి రూపాయి కూడా తేలేదని, ఎంపీ నిధులను కూడా వెనక్కి పంపారని అన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే, అందులో ఒక్కటి కూడా కామారెడ్డికి ఇవ్వలేదన్నారు. బీబీపాటిల్, సురేశ్ శెట్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.
అంతకుముందు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు. మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని అన్నారు. రేవంత్రెడ్డి ఎక్కడికెళ్తే.. అక్కడి దేవుళ్ల మీద ఒట్టేసి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని మయా మాటలు చెబుతున్నాడని అన్నారు. అధికారంలోకి వచ్చి ఐదునెలల గడుస్తున్నా చేయని రుణామాఫీ.. ఆగస్టులో ఎలా చేస్తారని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ‘పాంచ్ న్యాయ్’ హామీలతో ప్రజలకు పంగనామాలు పెట్టడం ఖాయమని అన్నారు. లోక్సభ అభ్యర్థి గాలి అనిల్కుమార్ మాట్లాడుతూ..
తనను గెలిపిస్తే స్కిల్ డెవలప్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరోద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. వర్ని నుంచి బాన్సువాడ, జుక్కల్, జోగిపేట, సంగారెడ్డి మీదుగా రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ లైన్ కోసం అధికారులు మార్కింగ్ ఇచ్చినా అప్పటి ఎంపీలు బీబీ పాటిల్, సురేశ్ శెట్కార్ పట్టించుకోలేదన్నారు. రోడ్షో సందర్భంగా మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఎంపీపీ నర్సింగ్రావు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పగడాల బాల్చంద్రం తదితరులు పాల్గొన్నారు.