హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైడ్రాలో ఫైర్ ఎన్వోసీల కుంభకోణం కలకలం రేపింది. గత మూడురోజులుగా ఈ నకిలీల వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులు నెలరోజుల క్రితమే నకిలీల బాగోతం బయటపడినప్పటికీ అప్రమత్తం కాకపోవడం గమనార్హం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేశారంటూ ఎనిమిది కాలేజీలపై గత నెల నాలుగున పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు ఇప్పటివరకూ ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా, తాము జారీచేసిన ఎన్వోసీల్లో ఎన్ని నకిలీవో తేల్చడంలో గోప్యత పాటిస్తున్నారు. హైడ్రా ఇప్పటివరకు ఎన్ని కళాశాలలకు ఎన్వోసీలు జారీ చేసిందో వెల్లడించడం లేదు.
ఇంటర్బోర్డుకు కూడా ఆ జాబితా పంపకుండా నేరుగా హైడ్రా అధికారులే అక్కడికి వెళ్లి ధ్రువీకరణపత్రాలు పరిశీలించడం వెనక ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా క్యూర్ పరిధిలోని పలు భవనాలకు కూడా ఫైర్ ఎన్వోసీలను జారీచేసింది. పలు అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, కళాశాలలకు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు మంజూరు చేశారు. వీటన్నింటికీ ఫైర్ ఎన్వోసీ ఉంటేనే మున్సిపల్ శాఖ అనుమతులు లభిస్తాయి. వారిచ్చే ఓసీల ఆధారంగానే విద్యుత్తు కనెక్షన్ లభిస్తుంది.
ఈ నేపథ్యంలో ఎన్ని భవనాలకు హైడ్రా ఎన్వోసీ ఇచ్చిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా వద్ద గత రెండేండ్లలో ఎన్ని భవనాలకు ఫైర్ ఎన్వోసీలు ఇచ్చిందో లెక్క ఉండాలి. హైడ్రా ఏర్పాటైన తర్వాత సుమారు రెండు నుంచి మూడువేల వరకు సర్టిఫికెట్లు ఇచ్చి ఉండవచ్చని ఒక అధికారి తెలిపారు. ఫేక్ ఎన్వోసీలు, సంతకాల ఫోర్జరీ వ్యవహారంతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా ఎందుకు పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూడురోజుల క్రితం ఈ కేసు విషయం బయటకు రాగానే అంతా హడావిడి చేస్తూ మీడియాతోపాటు అందరి దృష్టి తమ వైపు నుంచి కళాశాల విద్యాశాఖ వైపు మరల్చేలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ హైడ్రాలోనే కొందరు సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు.
నకిలీ ఫైర్ ఎన్వోసీల విషయంలో అసలు సూత్రధారులను ఉపేక్షిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాలలకు ఫైర్ ఎన్వోసీ ఇచ్చిన వారెవరు.. వారి వెనుక ఎవరుండి నడిపించారనే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతున్నప్పటికీ హైడ్రాకు సంబంధించిన అధికారుల హస్తం లేకుండా ఇంత పెద్ద దందా జరుగుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. హైడ్రా అధికారులు ఎవరెవరు ఈ ఎన్వోసీల జారీ ప్రక్రియలో భాగస్వాములయ్యారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సూత్రధారులను కనిపెట్టే వ్యవహారంలో హైడ్రాలో కొందరు అధికారులు, సిబ్బంది పైకి పనిచేస్తున్నట్టు కనిపించినా అంతర్గతంగా ఈ వ్యవహారాన్ని కళాశాల విద్యాశాఖ వరకే పరిమితం చేసి మిగతావి బయటకు రాకుండా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాలేజీలు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పే, వాటిపై చర్యలు తప్పనిసరి.