Keesara PS : తెలంగాణ (Telangana) లో ఇద్దరు పోలీసు అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) కు చిక్కారు. మల్కాజ్గిరి కమిషనరేట్ (Malkajgiri Commissionerate) పరిధిలోని కీసర పోలీస్స్టేషన్ (Keesara Police Station) లో ఈ ఘటన జరిగింది. రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరించిన కేసులో ఇన్స్పెక్టర్, ఎస్హెచ్వో అర్కపల్లి ఆంజనేయులు (Arkapally Anjaneyulu), సబ్-ఇన్స్పెక్టర్ ద్యాప జ్ఞానేందర్ రెడ్డి (Dyapa Gyanender Reddy) ని ఏసీబీ అధికారులు (ACB Officials) గురువారం అరెస్ట్ చేశారు.
ఒక కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతోపాటు బాధితుడిని, అతని స్నేహితుడిని ఇకపై వేధించకుండా ఉండేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తమ ప్రకటనలో వెల్లడించింది. పోలీసుల వేధింపులు ఎక్కువవడంతో బాధితుడు నేరుగా ఏసీబీని ఆశ్రయించాడు.ముందుగా రూ.10 లక్షలు డిమాండ్ చేసిన పోలీసులు.. చివరికి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడితో గత కొన్ని రోజులుగా నిందితులు బిర్యానీలు, కూల్ డ్రింకులు తెప్పించుకుని వేధించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో గణేష్ నిమజ్జన డ్యూటీలో ఉన్న ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, కీసర చెరువు సమీపంలో ఒక కారులో రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సూచన మేరకే ఎస్ఐ ఈ డబ్బును స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎస్ఐని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆపరేషన్ అనంతరం ఇన్స్పెక్టర్, ఎస్ఐ ఇద్దరినీ అరెస్ట్ చేసిన ఏసీబీ, వారిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కీసర పోలీస్ స్టేషన్తోపాటు అధికారుల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్-ఫ్రీ నంబర్ 1064 కు సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ ప్రజలకు సూచించింది.