తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams )భాగంగా మూడో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ( Lord Malayappa ) యోగ నరసింహుని అలంకారంలో సింహ వాహనం ( Simha Vahanam ) పై భక్తులకు దర్శనమిచ్చారు.

స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ సింహ వాహనసేవ అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా సాగింది.
సింహరూప దర్శనం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, పట్టుదలను, విజయస్ఫూర్తిని మేల్కొలుపుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం. సోమరితనాన్ని వీడి కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగేందుకు సింహ వాహనసేవ స్ఫూర్తినిస్తుందని అర్చకులు తెలిపారు. ఈ వాహనసేవ లో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో కే వి మురళీకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.