పళ్లబురుసు కొనివ్వలేదని ఓ తండ్రి తన కొడుకుపై పోలీస్స్టేషన్లో కేసుపెడతాడు. ఇంత చిన్న విషయానికి స్టేషన్ దాకా ఎందుకొచ్చావని పోలీసులు ఆశ్చర్యపోతారు. మరి ఈ తండ్రీకొడుకుల పంచాయితీ ఏందో తెల్వాలంటే ‘పళ్లబురుసు’ సినిమా చూడాల్సిందే. ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటించిన ఈ తెలంగాణ నేపథ్య చిత్రానికి ఉదయ్చౌహాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం ట్రైలర్ను అగ్ర నటుడు నాగార్జున విడుదల చేశారు. విడుదలకు ముందే ట్రైలర్ను సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమా షూటింగ్ మొత్తం లచ్చపేట గ్రామంలోనే జరిపాం. అందుకే ట్రైలర్ను ముందుగా వారికి చూపించాం’ అన్నారు. గ్రామీణ నేపథ్యంలో తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా ట్రైలర్ ఆకట్టుకుంది. పళ్లబురుసు కేసు వెనక అసలు కారణమేంటనే అంశం ఆసక్తినిరేకెత్తించేలా ఉంది. ఈ చిత్రానికి కెమెరా: వినోద్ కె బంగారి, సంగీతం: పవన్ సీహెచ్.