ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్, జనవరి 31 : కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించడమేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ.. కేసీఆర్కు కేసులు, నోటీసులు కొత్తేం కాదని, ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు, నిర్బంధాలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, తప్పు చేయని కేసీఆర్ భయపడేది లేదన్నారు.

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక, రాక్షస పాలన అంతమొందించేవరకు ప్రజలందరి తరపున పోరాడుతూనే ఉంటామన్నారు. పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ సూర్య, చంద్రులున్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లోనే ఉంటారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట ఆనవసర ఆరోపణలు చేస్తూ కేసీఆర్ను సిట్ విచారించడం సిగ్గు చేటన్నారు.
పాలన చేత కాని దద్దమ్మలు ఆడుతున్న నాటకాన్ని తెలంగాణ సమాజం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నదని తెలిపారు. కెసీఆర్ను విచారణకు పిలుస్తున్నారని తెలిసిన వెంటనే తెలంగాణలోని పల్లెలు భగ్గుమంటున్నాయని, ఆ మంటల్లో కాంగ్రెస్ పార్టీ కాలిపోవడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.