నిజాంసాగర్, మార్చి 21: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంతర్రెడ్డి ఎన్నికల ముందు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించారన్నారు. రైతులకు అవసరమైన సమయంలో పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు సరైన నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని, దీంతో పేదలకు ఎలాంటి లాభం లేదన్నారు.
బడ్జెట్లో జుక్కల్ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని షిండే డిమాండ్ చేశారు. ప్రతి మహిళకూ రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు, కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం వంటి హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. నాయకులు బన్సీ పటేల్, కృష్ణాపటేల్, పాకాల విజయ్, దారస్ సురేశ్, సుల్తాన్, ఎంకే పటేల్, నాగనాథ్, తుక్కారాం, గంగాధర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.