కామారెడ్డి, మే 4 : రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నదని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు. దమ్ముంటే రద్దు చేసి చూడాలని, కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను ఇక్కడి ప్రజలు అడుగుపెట్టనీయబోరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి అమలుచేయడంలేదన్నారు. ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీకి త్వరలో తాళాలు పడే రోజులు తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికే 20 శాతం బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయని చెప్పారు. సీఎం గ్యారెంటీలు, రూ. రెండు లక్షల రుణమాఫీని ప్రజలు, రైతులు నమ్మడంలేదన్నారు. వరికి రూ.500 బోనస్ అంటూ రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి చేసిందేమీలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు నూకలు బుక్కిస్తారని అన్నారు. మతం పేరుతో బీజేపీ మాట్లాడితే వాళ్ల మీద కేసులు ఉండవని, కేసీఆర్ మాట్లాడితే కేసులు పెడతారని మండిపడ్డారు.
ఆంధ్రాలో కలుపుతారా? ; మాజీ ఎమ్మెల్యే జాజాల
ఆంధ్రలో చంద్రబాబు సీఎం అయితే రేవంత్రెడ్డి తెలంగాణను కూడా ఆ రాష్ట్రంలో కలుపుతారేమోనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మేల్యే జాజాల సురేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ప్రజలకు చేసిందేమీలేదని విమర్శించారు. కాళేశ్వరం గురించి మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువు సృష్టించిందన్నారు. సమస్యల నుంచి ప్రజలను మళ్లించడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించడానికి జిల్లాల రద్దు కోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, రేవంత్ రెడ్డి ఒక్కటై జిల్లాల రద్దుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొట్లాడి తెచ్చుకున్న కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ కామారెడ్డి జిల్లాను రద్దు చేసి ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు. ఈ నెల 13లోపు కామారెడ్డి జిల్లాను రద్దు చేయడం లేదని సీఎం ప్రకటించాలని.. లేనిపక్షంలో ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. కేసీఆర్ బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన రావడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక, 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించేలా కుట్ర చేసిందని ఆరోపించారు.