వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మద్నూర్లో ఆదివారం నిర్వహించిన మద్నూర్, డోంగ్లి, జుక్కల్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మద్నూర్, డిసెంబర్ 10: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని, ప్రతి గ్రామానికి వచ్చి తాను ప్రచారం చేస్తానని, అందరినీ గెలిపించుకునే బాధ్యత తాను తీసుకుంటానని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన మద్నూర్, డోంగ్లి, జుక్కల్ మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.15 ఏండ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులు తెలియజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు. కార్యకర్తలందరూ ఇకనుంచి కలిసికట్టుగా పనిచేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో తమ సర్పంచ్, ఎంపీటీసీ గెలిచేలా ఇప్పటినుంచి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, వాటిని గౌరవించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, లేనిపక్షంలో వారిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. హామీలన్నీ అమలు చేసేవరకు వారిని నిద్రపోనివ్వబోమని, తాము నిద్రపోమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనను ఇతర రాష్ర్టాల వారు మెచ్చుకున్నారని, ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం అర్థం కాలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మద్నూర్, జుక్కల్, డోంగ్లి మండలాల అధ్యక్షులు బన్సీపటేల్, మాధవ్రావు దేశాయి, శశాంక్పటేల్, డీసీసీబీ డైరెక్టర్ రాంపటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫార్, వైస్ ఎంపీపీ జైపాల్రెడ్డి, విండో మాజీ చైర్మన్లు విజయ్కుమార్, పండిత్రావుపటేల్, నాయకులు సాయాగౌడ్, నీలూ పటేల్, శివాజీ, గంగారాం, విఠల్, రాజు, నాగేశ్, రవి, సుధీర్, జ్ఞా ను, లక్ష్మణ్, బలిరాం, దేవిదాస్, గోపి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.