రామారెడ్డి , ఫిబ్రవరి 8: పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్నది. స్థానిక ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన గోసంగి సాంబకు ముగ్గురు భార్యలు. మొదటి భార్య కూతురైన కోదండం భారతి (15) స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నది.
గురువారం ఉదయం భారతిని పాఠశాలకు వెళ్లాలని తండ్రి మందలించి భార్యతో కలిసి ఉప్పల్వాయిలో కూలీ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం వారు ఇంటికి తిరిగి రాగా.. లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కిటికీలో నుంచి చూడగా భారతి ఉరేసుకొని కనిపించింది. తలుపులను పగులగొట్టి చూడగా అప్పటికే ఆమె మృతిచెందిందని ఎస్సై తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.