మెండోరా : శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస్పీ రిజర్వాయర్లోకి 70,620 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో 16 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, లక్ష్మి కాలువకు 150, సరస్వతీ కాలువకు 800, వరద కాలువకు 12,004క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు.
ప్రస్తుత సంవత్సరం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్కు 311.713 టీఎంసీలు వరద నీరు వచ్చిందన్నారు. ఎస్సారెస్పీ దిగువన ఉన్న కాలువలకు, గోదావరిలోకి మిగులుజలాలను 239.836 టీఎంసీల నీటిని వదిలేసినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్తాయి నీటిమట్టం 1091.00 అడుగులు(90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిఉందని ఆయన వెల్లడించారు.