కామారెడ్డి, ఫిబ్రవరి 5 : ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతి ఏడాది జూన్ ప్రారంభంలో స్కూల్ గ్రాంట్స్ కింది ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) అకౌంట్లలో జమ చేస్తారు. కరోనా కారణంగా పాఠశాలల ప్రారంభం ఆలస్యం కావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఎస్ఎంసీలతో చర్చించి పాఠశాల అవసరాలకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు నిధులను వినియోగిస్తారు. మొదటి విడుత కింద 50శాతం నిధులను విడుదల చేసింది. 2021-22 విద్యా సంవత్స రానికి గాను నిధులను కేటాయించింది. కామారె డ్డి జిల్లాలో 1011 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీ టిలో 95వేల మంది విద్యార్ధులు ఉన్నారు. వీటిలో 181 జిల్లా పరిషత్ పాఠశాలలు, 697 ప్రాథమిక పాఠశాలలు, 127 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు నిధుల విడుదలకు కార్యాచరణ రూపొందించింది. రాబోయే మూడేండ్ల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. మొదటి విడుత కింద 50శాతం గ్రాంట్ను విడుదల చేసి ఎస్ఎంసీ గ్రాంట్కు జమ చేశారు. 1011 పాఠశాలలకు గాను రూ.1,44,92,500 నిధులను విడుదల చేసి బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. వీటిని ఆయా పాఠశాలల అవసరాలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా వినియోగించాల్సి ఉంటుంది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆమోదం మేరకే నిధులను వినియోగిస్తారు. కామారెడ్డి జిల్లాలో 1011 ఎస్ఎంసీలు సమావేశాలు నిర్వహించుకొని అవసరాల అనుగుణంగా నిధులను ఖర్చు చేస్తాయి. ముఖ్యంగా పాఠశాలల్లో స్టేషనరీ, విద్యుత్ బిల్లు, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలు, బడిబాట, ఇంటర్నెట్, శానిటైజేషన్ తదితర అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తారు.