ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది
ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
వర్షప్రభావిత ప్రాంతాల్లో ఆశన్నగారి జీవన్రెడ్డి పర్యటన
ఆర్మూర్, జూలై 15: కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల్లో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. గండ్లు పడిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. రైల్వే అండర్ పాస్ వంతెనల కింద భారీగా నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు జీవన్రెడ్డి దృష్టికి తెచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు ఫోన్ చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వరదలు సంభవించి కోతకు గురైన చెరువులు, చెక్డ్యామ్లు, రోడ్ల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, పోలీసు, ఆరోగ్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ ప్రమాదాలు తలెత్తకుండా గ్రామస్థాయిలో లైన్మన్లు అందుబాటులో ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ ఆపద రాకుండా చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు.
అధైర్యపడొద్దు..
ప్రజలు అధైర్యపడొద్దని, కేసీఆర్ ప్రభుత్వం ఏ కష్టం రానివ్వదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి భరోసానిచ్చారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు వెంటనే మరమ్మతులు చేసేందుకు వివిధ శాఖల అధికారులు అంచనాలు వేస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం అందజేస్తామని వెల్లడించారు. పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పంట, ఆస్తి నష్టం అంచనా వేసి ప్రతిఒక్కరికీ పరిహారం చెల్లిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.