కామారెడ్డి, ఏప్రిల్ 10 : ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డితో కలిసి బుధవారం నోడల్ అధికారులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అనుమతులు, ఫిర్యాదులపై స్పందించడం, అక్రమంగా డబ్బు, మద్యం తరలించడం, కానుకలను స్వాధీనం చేసుకోవడం, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థి చేసే ప్రతి ఖర్చుకు సం బంధించి లెక్కలు చూపాల్సి ఉంటుందని అన్నారు.
కోడ్ ఉల్లంఘన, డబ్బు, మద్యం అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేసి రోజూవారి నివేదికలు సమర్పించాలని సూచించారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు వంటివి ముద్రించే విషయంలో సెక్షన్ 127 ఏ సూచనలు పాటించాలన్నారు. బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటు వేసే విధానంపై పట్టణ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ప్రక్రియ సోమవారం నాటికి పూర్తి చేయాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించిన వారికి ఎలాంటి మినహాయింపు లేదని, హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోడల్ అధికారులు వరదారెడ్డి, శ్రీనివాస్, అంబాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాజారామ్, ఏవో మసూర్ అహ్మద్, ఎన్నికల పర్యవేక్షకులు ప్రేమ్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని, జ్యోతి, స్వప్న, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.