సమైక్య పాలనలో చితికిపోయిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్పూర్వవైభవం తీసుకొచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ, మత్స్య, కుమ్మరి, గొల్లకుర్మ.. ఇలా అన్ని కులాలకు దండిగా చేయూతనిచ్చి ఆత్మగౌరవ జీవనానికి బాటలు వేశారు. అదే కోవలో ఆర్థికంగా వెనుకబడిన గొల్లకుర్మలకు జవ‘జీవాలు’ కల్పించారు. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి రాష్ట్రంలో గులాబీ విప్లవానికి శ్రీకారం చుట్టారు. దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్న గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడీతో 20 గొర్రెలు, పొట్ట్టే్టలుతో కూడిన యూనిట్లు పంపిణీ చేశారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మొదటి విడుత కింద 21,518 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. కరోనా కారణంగా రెండో విడుతకు ఆటంకం ఏర్పడినప్పటికీ, ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నది. జీవాల పంపిణీ ఊపందుకోవడంతో ఎలమంద ముఖం దరహాసంతో వెలిగిపోతున్నది.
– నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్
నిజామాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మహోన్నత లక్ష్యంతో కూడుకున్న పథకాలను తీసుకురావడంలో తెలంగాణ సర్కారును మించినదే ఈ దేశంలో లేదు. భిన్న ప్రయోజనాలు కలగలిసిన కార్యక్రమాలను తీర్చిదిద్ది అందించడంలో కేసీఆర్కు సాటిలేరు. అవినీతి ఛాయలేవీ మచ్చుకూ కనిపించకుండా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా, కచ్చితత్వంతో లబ్ధిదారులను గుర్తించి యూనిట్లు అందిస్తున్నది. సామాజిక మార్పు, ఆర్థిక భరోసాను కల్పించేలా పథకాలను తీర్చిదిద్ది ఆయా వర్గాలను ఆదుకుంటున్నది. ఇందులో నుంచి ఉద్భవించినదే గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం. గతంలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటేనే పెద్ద ప్రహసనంగా ఉండేది. అధికారులకు లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గొల్ల, కుర్మల సొసైటీల ఏర్పాటుకు నిబంధనలను మార్చారు. చట్ట సవరణ చేసి పశు, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో పారదర్శకంగా, పైసా ఖర్చు లేకుండా కనిష్ఠ సభ్యత్వ రుసుముతో జిల్లాలో సొసైటీలు పురుడు పోసుకున్నాయి. వీరందరికీ ప్రభుత్వమే గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. దీంతో కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారిలో కొండంత భరోసా కలుగుతున్నది.
2017 సంవత్సరంలో గొర్రెల పెంపక వృత్తిపై ఆధారపడ్డ ప్రాథమిక గొర్రెల మేకల పెంపక సహకార సంఘ సభ్యులైన గొల్ల, కురుమ, యాదవ సభ్యులకు 75శాతం రాయితీతో నిజామాబాద్ జిల్లాలో 19,106 గొర్రెల యూనిట్లు రెండో దశల్లో అందించేందుకు ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మొదటి దశలో 10,722 యూనిట్లు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో 10,796 యూనిట్ల పంపిణీ జరిగింది. రెండోదశలో 6,099 యూనిట్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. రాష్ట్రంలో మాంసాహార ఉత్పత్తిని పెంచడంతోపాటు గొల్ల, కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా రాయితీపై గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు తీవ్రంగా కృషి చేస్తున్నది. మాంసాహార మార్కెట్లో రాష్ట్రం వాటా పెరుగుతుందని ఆశించిన సీఎం కేసీఆర్ అంచనాలకు తగ్గట్లుగానే పల్లెల్లో జీవాల సంపద పెరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన జీవాల విలువతో పోల్చితే ప్రస్తుతం ప్రతి గొర్రెల యూనిట్లో సుమారుగా 13 చొప్పున జీవాలు పెరిగాయన్నది ప్రభుత్వాధికారుల క్షేత్రపర్యటనల్లో తేలింది.
ఒక్కో గొర్రెల యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేసేందుకు గతంలో లబ్ధిదారుల నుంచి రూ.31,250 డబ్బులను డీడీ రూపంలో తీసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం మరో రూ.12,500 చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్ రాయితీని పెంచినందుకు లబ్ధిదారుల వాటాను పెంచినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే వివరించింది. ఇప్పటికే మార్పులు, చేర్పులకు గురైన పథకం విధివిధానాలకు అనుగుణంగా డీడీలు చెల్లించిన వారంతా నూతన నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేశారు. పాత విధానంలో యూనిట్ విలువ రూ.1,25,000 ఉంది. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.31,250గా నిర్ణయించారు. కొత్త విధానంలో యూనిట్ విలువ రూ.1,75,000 కావడంతో లబ్ధిదారుని వాటా రూ.43,759కి చేరింది. చాలా మంది లబ్ధిదారులు పెరిగిన కొత్త యూనిట్ ధర ప్రకారం వాటాను చెల్లించి పథకంలో భాగమవుతున్నారు. అందుకు అనుగుణంగా పారదర్శకంగా అర్హులైన వారికి యూనిట్లను అందిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలోనూ ఎవరి ప్రోద్బలం లేకుండా లాటరీ విధానంలో కేటాయింపులు చేస్తున్నారు. గొర్రెల యూనిట్ల రవాణా ఖర్చును సర్కారే భరిస్తున్నది.
బోధన్, సెప్టెంబర్ 11: రాష్ట్రం ఆవిర్భావం అనంతరం జిల్లాలో గొర్రెలు, మేకల ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 2014కు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేవలం 80 సంఘాలు మాత్రమే ఉండేవి. 2014లో ఆ సంఘాల సంఖ్య 223కు పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహం, గొర్రెలు, మేకల సంపద అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో మరిన్ని సహకార సంఘాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో 326 ప్రాథమిక గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘాలు ఉండగా, ఇందులో సుమారు 20వేల మంది సభ్యులు ఉన్నారు.
సదాశివనగర్, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ గొర్రెలతో కుర్మ కులస్తులమంతా ఆర్థికంగా ఎదుగుతున్నాం. సదాశివనగర్ మండలంలో మొదటి విడుతలో 305 యూనిట్లు, రెండో విడుతలో 83 యూనిట్లు అందించారు. ప్రతి ఆడ గొర్రె సంవత్సరంలో మూడు ఈతలు, పిల్లలను కంటుంది. దీంతో కాపరులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. త్వరలో మరికొంత మందికి సబ్సిడీ గొర్రెలను ప్రభుత్వం అందిస్తుంది.
– కందూరి బీరయ్య, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు
నవీపేట, సెప్టెంబర్ 11: ఐదేండ్ల కిందట సీఎం కేసీఆర్ సార్ నాకు ఒక యూనిట్ మంజూరు చేసి, 20 గొర్రెలు, ఒక పొట్టేల్ ఇచ్చిండ్రు. మూడు నెలలకోసారి గొర్రెలు ఈనడంతో గొర్రెల మంద పెరిగింది. ఆరు నెలలకోసారి గొర్రెలను అమ్మితే రూ.3లక్షల వరకు ఆదాయం వస్తుంది. నెలకు ఖర్చులు పోను రూ.30వేల నుంచి రూ.50వేలకు సంపాదిస్తున్నాను. గొర్రెలు అమ్మిన పైసల్తో మా పిల్లల పెండ్లి చేసిన. నాతోపాటు మా తమ్ముడు, అన్నకు కూడా గొర్రెల యూనిట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నా దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి. మా కుటుంబం మొత్తం ఏ రంది లేకుండా ఆనందంగా ఉన్నం. జీవితాంతం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– గొల్ల గంగాధర్, కోస్లి, నవీపేట
గొర్రెలు ఇస్తుండ్రంటే ఆరేండ్ల కింద దరఖాస్తు జేసిన. మా వాటాగా కొద్దిగా పైసల్ కడితే మాకు 20 గొర్రెలు, ఒక పొట్టేల్ ఇచ్చిండ్రు. ఎక్కడా నయా పైసా లంచం ఇయ్యలేదు. లాటరీలో నా పేరు ఎల్లింది. పిలిచి మరీ యూనిట్ను ఇచ్చిండ్రు. జీవాలను నేనే స్వయంగా అనంతపూర్ వెళ్లి కొనుక్కుని వచ్చినా. నాతోని పశువైద్య సార్లు సుతా వచ్చిండ్రు. వారి సలహాలు, సూచనలను పాటించి పెంపకం చేసిన. ఈ ఆరేండ్ల కాలంలో కేసీఆర్ నాకిచ్చిన గొర్లను రెట్టింపు జేసిన. వాటిలో పిల్లలు అనేకం ఇప్పటికీ పెరుగుతున్నయి. వాటిని సక్కగా కాపాడుకుంటున్నం. మాకు మంచిగా గొర్రెలిచ్చి కేసీఆర్ సార్ సక్కగా ఆదుకున్నడు. ఆయనిచ్చిన సహకారాన్ని యాది మరువం.
– పెద్దకుర్మ లక్ష్మణ్, ముల్లంగి
చాలా ఏళ్ల సంది గొర్లు మేపుకుంట బతుకుతున్నం. మాకు గతం నుంచి ఉన్న గొర్లను పెంచుకుంటూ ఉన్న మందను కాపాడుకుంటా పోతున్నం. గతంల ఏ ప్రభుత్వమూ మమ్మల్ని, మా గొర్ల గురించి పట్టించుకున్నోళ్లే లేరు. కానిప్పుడు కేసీఆర్ సార్ వచ్చినంక మాకు ఆదరణ దక్కుతున్నది. జీవాలకు ఆరోగ్యపరమైన సౌలత్ కూడా ఇప్పుడున్నది. నాకు వారం దినాల క్రితం 20 గొర్లు, ఒక పొట్టేల్ ఇచ్చిండ్రు. లక్షలు విలువ చేసే మంచి జీవాలను మాకిచ్చి ఆదుకుంటుండు. వీటిని మల్లొచ్చే ఏడాదికి డబుల్ జేసుకుంటా. కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– బూరోళ్ల చిన్న సాయిలు, ముల్లంగి
గతంలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. 2018లో గొర్రెల పంపిణీ పథకంలో నాకు, మా నాన్నకు రెండు యూనిట్లు ఇచ్చిండ్రు. ఆనాడు ఇచ్చిన గొర్రెలు ఇప్పుడు 120 గొర్రెలు అయ్యాయి. ప్రతి మూడు, ఆరు నెలలకోసారి గొర్రెలను అమ్ముతున్న. అమ్మినప్పుడల్లా రెండు లక్షలు వస్తున్నయ్. ఇంకొకల్ల దగ్గర జీతం చేయకుండా నేనే మస్తు సంపాదిస్తున్న. నా భార్యా, పిల్లలు సంతోషంగా ఉన్నరు. ఇంత సాయం చేసి మమ్మల్ని ఆదుకున్న సీఎం కేసీఆర్ సల్లంగ ఉండాలె.
– అలపురం ప్రవీణ్, నవీపేట
గాంధారి, సెప్టెంబర్ 11: ఆర్థికంగా వెనుకబడిన గొల్లకుర్మలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నది. గొర్రెల పంపిణీతో మా యాదవ కులస్తులకు ఉపాధి దొరకడంతోపాటు ఆర్థికంగా భరోసా కలిగింది. మా కుల సంఘంలో 140సభ్యులుండగా 123మంది గొర్రెల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడుత గొర్రెల పంపిణీలో 65 మందికి వచ్చినయ్. ఇప్పుడు రెండో విడుతలో 58 మందికి గొర్రెల వస్తున్నాయి. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం.
– దొల్లు రమేశ్, గొర్రెల లబ్ధిదారుల సంఘం అధ్యక్షుడు, గాంధారి.
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ ఏర్పాటు తర్వాత మా కుటుంబ పోషణ సులభంగా మారింది. సీఎం కేసీఆర్ సారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రూ.33వేలకు 21 గొర్రెలను అందజేశారు. ప్రతి సంవత్సరం ఒక్కో గొర్రె రెండు పిల్లలను కన్నది. నాలుగేండ్లలో గొర్రెల మంద పెరిగింది. వాటి నుంచి వచ్చే ఉన్ని, ఎరువు కూడా మాకు జీవనాధారంగా మారింది. కేసీఆర్ సారే మా కుటుంబానికి దేవుడయ్యాడు.
– అయినాల శ్రీనివాస్ యాదవ్, మైలారం, నస్రుల్లాబాద్
సీఎం కేసీఆర్ మా గొల్లకుర్మలకు గొర్రెలను ఇచ్చి ఆదుకుంటున్నడు. మొదట్లో ఇచ్చిన గొర్రెలను మంచిగ పెంచిన. మంద పెరిగింది. మస్తు లాభం వచ్చింది. ఒకప్పుడు మమ్మల్ని పట్టించుకుటోళ్లే లేకుండె. కేసీఆర్ సారు అచ్చినంక సబ్సిడీ గొర్రెలు ఇచ్చి మంచిగ బతికేటట్లు చేసిండు. ఇప్పుడు ఎవ్వరి దగ్గర బాకీలు చేయకుండా బతుకుతున్నాం.
– కందూరి పెద్ద సాయిలు, గొర్రెల కాపరి, అడ్లూర్ ఎల్లారెడ్డి
గాంధారి, సెప్టెంబర్ 11: గొర్రెలు పంపిణీ చేసి ఉపాధి కల్పించిన సీఎం కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటాం. మొదటి విడుత గొర్రెల పంపిణీలో నాకు 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేల్ను ఇచ్చిండ్రు. ప్రస్తుతం ఆ గొర్రెల మంద పెరగడంతోపాటు కొన్నింటిని విక్రయించడంతో రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చింది. నాలుగేండ్ల కింద ఎలాంటి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. ప్రస్తుతం నా వద్ద చిన్నవి, పెద్దవి కలిపి 50 వరకు గొర్రెలు ఉన్నాయి. గొర్రెల మంద పెరగడంతో మా కుటుంబానికి ఆర్థికంగా భరోసా దొరికింది.
– ఒడుసుల రాజు, గాంధారి
గొర్రెల పంపిణీ రెండో విడుత ప్రారంభించడం హర్షణీయం. మొదటి విడుతలో ఇచ్చిన గొర్రెలతో చాలామంది బాగుపడ్డారు. ఇప్పుడు రెండోవిడుత కింద గొర్రెలు ఇస్తున్నారు. గొర్రెలు ఏడాదికి రెండు ఈతలు ఈనుతాయి. దీంతో ఆరు నెలలకొకసారి గొర్రెలు డబుల్ అవుతాయి. నాలుగేండ్ల కింద ఇచ్చిన గొర్రెలు ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగి గొర్రెలు తీసుకున్నోళ్ల సంపద పెరిగింది. సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి ఇటువంటి స్కీమ్ వచ్చింది. గొల్ల, కుర్మల ఆదాయాలు పెంచేందుకు కృషి చేస్తున్న కేసీఆర్ సార్కు గొల్ల, కుర్మలు ఎప్పటికీ రుణపడివుంటారు.
– మేడి రవి, కుర్మ సంఘం బోధన్ మండలం అధ్యక్షుడు
నేను చదువుకోలేదు. గొర్రెలు కాసుడే నా పని.. మా నాయన సుత గొర్రెలు కాస్తడు.. అప్పట్ల గొర్రెలు తక్క ఉంటుండె..అప్పట్ల నాకు జీతం పడకుండె.. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ మాలాంటోళ్ల కోసం ఈ గొర్రెల పంపిణీ పథకం మొదలెట్టిండు.. తెలంగాణ రాకముందు మమ్మల్ని ఎవరూ పట్టించుకున్నది లేదు.. మొదటి విడుత కింద మా నాయనకు గవర్నమెంట్ గొర్రెల్ని ఇచ్చింది. మొన్న నాకు ఒక యూనిట్ గొర్రెలు వచ్చినవి. మొదటి విడుత గొర్రెలు ఈనడంతో గొర్రెలు బాగా పెరిగినయి. ఇప్పుడు ఇచ్చిన గొర్రెలతో మొత్తం 90 గొర్రెలయినయ్. ఇపుడు ఏడాదికి రెండున్నర లక్షల మీదనే మా కుటుంబానికి ఆమ్దానీ వస్తున్నది.
– పెంట శ్రీకాంత్, గొర్రెల పెంపకందారుడు, పెగడాపల్లి, బోధన్ మండలం
నా జీవనాధారం గొర్రెలు కాయడం.. మాకు వేరే పని చేద్దామన్నా రాదు.. ఈ పని తప్ప ఇంకే పనిచేయలేదు. కేసీఆర్ సార్ గొర్రెల పెంపకందారుల సంపద పెంచేందుకు మంచి స్కీమ్ తీసుకువచ్చిండు.. నాకు 50 గొర్రెలు ఉన్నాయ్.. ఇప్పుడు రెండో విడుత కింద కేసీఆర్ సార్ 20 గొర్రెలు ఇచ్చిండు.. ఇప్పుడు ఇచ్చిన గొర్రెలతో మాకు గిట్టుబాటు అవుతది. గొర్రెల సంఖ్య పెరగడంతో మాకు సంపద పెరుగుతుంది. ఒక పక్క మా సంపదతోపాటు ఊర్ల గొర్రెల సంపద పెరిగి ఊరికి మంచి జరుగుతుంది.. కేసీఆర్కు నా కృతజ్ఞతలు..
– టేకుల బీరుగొండ, పెగడాపల్లి, బోధన్ మండలం
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ‘గొర్రెల పంపిణీ’ పథకం బాగున్నది. సర్కారు అందిస్తున్న సాయంతోపాటు మరిన్ని గొర్రెలు కొనుక్కొని మందను పెంచుకుంటున్నాం. ఇంతకు ముందు మా గురించి ఆలోచించిన ప్రభుత్వాలు లేవు. మొదట గొర్రెలు ఇక్కడి వాతావరణానికి ఇబ్బంది పడినా, కొన్ని రోజుల తర్వాత కుదురుకుంటున్నాయి. ఈ పథకం ఎప్పటికీ అందిస్తే, గొల్లకుర్మలకు చానా మంచిగుంటది.
– పి. నవీన్, ఎడపల్లి.