అణగారిన వర్గాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మైనారిటీలకు ‘లక్ష’ణంగా చేయూతనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వంద శాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున అందజేస్తున్నారు. మైనారిటీ కుటుంబాలకు వెలుగునిచ్చే ఈ పథకం కామారెడ్డి జిల్లాలో నేడు ప్రారంభం కానున్నది. తొలి విడుతలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 218 మందికి లబ్ధి చేకూరనున్నది. కలెక్టరేట్లో మధ్యాహ్నం జరుగనున్న కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్ కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 78 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
– కామారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)
కామారెడ్డి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించే ప్రక్రి య నేటి (శనివారం)నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు జిల్లా కేంద్రంలో చెక్కులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టరేట్లో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ చేతుల మీదుగా నియోజకవర్గంలోని 75 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను అందజేయనున్నారు. విడుతల వారీగా మిగతా వారికి చెక్కులను అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినట్లే.. మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించగా, కొన్ని సాంకేతిక కారణాలతో ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ప్రస్తుతం రూ.లక్ష ఆర్థిక సహాయం కింద ఈ దరఖాస్తుదారుల్లోనే అర్హులను ఎంపిక చేశారు.
వంద శాతం సబ్సిడీతో మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు 5,472 మంది ఉన్నారు. వారిలో అర్హులైన వారిని గతంలోనే ఎంపిక చేశారు. గత ఏడాది సబ్సిడీ రుణాల కోసం కామారెడ్డి నియోజకవర్గంలో 78 మందిని, బాన్సువాడ నియోజకవర్గంలో 44, జుక్కల్లో 58, ఎల్లారెడ్డి 38 మందిని ఎంపిక చేశారు. జిల్లా లక్ష్యం 218 కాగా అర్హులను ఎంపిక చేశారు. తాజాగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించనుండడంతో ఎంపిక చేసిన వారందరికీ ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన మైనారిటీలందరికీ ఏకమొత్తం గ్రాంట్గా అందజేస్తారు. ఇప్పటికే అందిన దరఖాస్తులకు ఇది వర్తింపజేయడంతో పాటు క్రిస్టియన్ మైనారిటీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ద్వారా చిరువ్యాపారులు, వివిధ వృత్తి పనులు చేసుకునే వారికి ఎంతో లాభం చేకూరుతుంది. ఇప్పటికే నిరుపేద విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తాజాగా ప్రారంభించిన రూ.లక్ష ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా మారనున్నది. జిల్లాలో 698 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
-ముజీబుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్
మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కామారెడ్డి నియోజకవర్గంలో చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో త్వరలో కార్యక్రమాలను నిర్వహించి ఎమ్మెల్యేల చేతుల మీదుగా చెక్కులను అందజేస్తాం.
-దయానంద్, ఎంఎఫ్సీ ఇన్చార్జి ఈడీ