కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మక పథకానికి ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన లభించింది. రూ. లక్ష సాయం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20వ తేదీతో గడువు ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో 21,215, కామారెడ్డి జిల్లాలో 17,282 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 27 వరకు పరిశీలించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే నెల 15న ఏక మొత్తంలో రూ. లక్ష ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందుకోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థికసాయం పొందిన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించి ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిఉంటుంది.
-కామారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) /ఖలీల్వాడి
మారెడ్డి, జూన్ 22 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి : సమైక్య రాష్ట్రంలో కులవృత్తులు జీవం కోల్పోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ఆధునిక యంత్రాల రాకతో కులవృత్తిదారులు ఆదరణ కోల్పోయారు. గత పాలకుల హయాంలో వారి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల్లో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ మరో పథకాన్ని ప్రారంభించారు. కులవృత్తిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. ఈ పథకానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ నెల 6 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించగా, జిల్లా వ్యాప్తంగా 17,282 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తులు వచ్చాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 9న తెలంగాణ సంక్షేమ సంబురాల్లో 32 మందికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ 10 మంది లబ్ధిదారులకు, బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 10 మందికి, జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే 9 మందికి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజాల సురేందర్ ఆరుగురు లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. దీంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమకు ప్రభుత్వం రూ.లక్ష సహాయం చేయడంతో వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర్థిక పరిపుష్టిని సాధిస్తామని వారు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకొనేందుకు 2021 నుంచి 2023 జూన్లోపు తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు చేయడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అనగా రజక, నాయీబ్రహ్మణ, విశ్వ బ్రాహ్మణ, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర కులవృత్తిదారులు అర్హులు కావడంతో దాదాపు అందరూ దరఖాస్తు చేసుకున్నారు.
లబ్ధిదారుల ఎంపిక ఇలా..
మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 20 నుంచి 26 వరకు పరిశీలిస్తారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ జిల్లా స్థాయిలో ఎంపిక పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించిన అనుమతులను ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్చార్జి మంత్రుల ద్వారా పొందుతారు. లబ్ధిదారులను దశల వారీగా ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని, గ్రామాలు, మండలాల వారీగా వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే నెల 15న ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తారు. ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారులపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు నెల రోజుల్లోపు తమ వృత్తిని ప్రారంభించాలి. లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు కలెక్టర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారికి బాధ్యతలను అప్పగించారు. అర్హులైన వారందరికీ ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ ప్రారంభం..
రూ.లక్ష ఆర్థిక సహాయం అందించే పథకానికి జిల్లా వ్యాప్తంగా 17,282 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువును పెంచడం లేదు. అర్హులైన వారిని ఈ నెల 27లోపు ఎంపిక చేస్తారు. అసంపూర్తి దరఖాస్తులు పరిశీలించబడవు. చేతి, కులవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించి, వారు వృత్తిలో అభివృద్ధి చెందేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బీసీ కులవృత్తిదారులు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-డి.శ్రీనివాస్, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, కామారెడ్డి
నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తుల వివరాలు..
నిజామాబాద్ జిల్లాలోనూ బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయానికి విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,215 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఆర్మూర్ 5098
బాల్కొండ 4449
బాన్సువాడ 1730
బోధన్ 3170
నిజామాబాద్ రూరల్ 4629
నిజామాబాద్ కార్పొరేషన్లో 2139
మొత్తం 21,215