రుద్రూర్, జనవరి 7 : రుద్రూర్, కోటగిరి, వర్ని మండలాల్లో కృషి విజ్ఞాన కేంద్రం -రుద్రూర్ శాస్త్రవేత్తలు పి.విజయ్కుమార్, డా.రాజ్కుమార్ పంటల్లో రోగ నిర్ధారకాలను పరిశీలించేందుకు శనివారం క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టారు. శాస్త్రవేత్తలు పలు గ్రామాల్లో వరి పంటలను పరిశీలించారు. 15 నుంచి 20 రోజుల దశలో ఉన్న పంటకు ఉల్లికోడు సోకినట్లు గమనించారు. గంగా కావేరి వరి రకంలో ఉల్లికోడును శాస్త్రవేత్తలు గమనించారు.
ఈ సందర్భంగా డా.విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఈ ఉల్లికోడు ఆశించిన పంటలో పిలకలు ఎదగక దిగుబడి తగ్గుతుందని, సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఫిప్రోనిల్ గుళికలు 8నుంచి 10 కిలోల చొప్పున చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. 25 రోజుల పైబడిన వరి పొలం అయితే ఫిప్రోనిల్ 5 శాతం, ఎస్సీ 2.5 మిల్లీ లీటరు చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన విభాగం శాస్త్రవేత్త పి.విజయ్కుమార్, సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త రాజ్కుమార్, రైతులు జనార్దన్, కృష్ణకాంత్, ప్రకాశ్, శ్రీనివాస్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.