Suicide | కామారెడ్డి : కుటుంబ కలహాలతో తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రాజెక్ట్ లో దూకి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన బోయి కృష్ణ తన భార్య సవిత ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని పటాన్ చెరువులో గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నారు. భర్త కృష్ణ సెక్యూరిటీ గార్డుగా భార్య సవిత హోటళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు.
తరచూ భార్య భర్తల మధ్య జరిగే గొడవలతో మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలు రక్షిత్, అనన్యతో కలిసి బయటకు వెళ్లి వస్తామని చెప్పి గురువారం బైక్ పై వెళ్లారు. ఉదయం వెళ్లిన వారు సాయంత్రం అయినప్పటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశారు. కృష్ణ తన ఇద్దరు పిల్లలతో ప్రాజెక్ట్ వద్ద దిగిన ఫొటోలు వీడియోలు పలువురికి వాట్సాప్ చేసిన అనంతరం డ్యామ్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.