– సీపీఎం అర్వపల్లి మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్
అర్వపల్లి, ఆగస్టు 04 : జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తుంగగూడెం ఇసుక రీచ్లో నిర్వహిస్తున్న ‘మన ఇసుక వాహనం’ పథకం క్వారీకి జిల్లా కలెక్టర్ నిధులతో సీసీ రోడ్డు (బాట) నిర్మించాలని, బాట ఏర్పాటు పేరుతో ట్రాక్టర్ యజమానుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జాజిరెడ్డిగూడెం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తాసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సామాన్య ప్రజల ఇసుక అవసరాలను తీర్చడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న ‘మన ఇసుక వాహనం’ పథకం అభినందనీయమన్నారు.
అయితే క్వారీకి వెళ్లే బాటను జిల్లా కలెక్టర్ నిధులతో నిర్మించాల్సి ఉండగా, అదే పేరుతో కొందరు ట్రాక్టర్ యజమానుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ జరిపి అక్రమ వసూళ్లను అరికట్టాలని కోరారు. క్వారీకి సీసీ రోడ్డు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి, పథకం నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఎం జాజిరెడ్డిగూడెం మండల కార్యదర్శి వజ్జే శ్రీనివాస్, మండల నాయకులు శిగ వెంకన్న, శిగ శ్రీకాంత్, శిగ వినయ్, సి.హెచ్.రమణ పాల్గొన్నారు.