దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారింది. బడుగు, బలహీనవర్గాలతోపాటు కులవృత్తులకు ఉచిత విద్యుత్ పథకం.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గతంలో మాదిరిగా పవర్ హాలీడేస్ లేకపోవడంతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నది. దీంతో కార్మికులకు చేతినిండా పని దొరుకున్నది.
– ఖలీల్వాడి/ఎల్లారెడ్డి, జూన్ 4
తెలంగాణ రాక ముందు విద్యుత్ కోతలతో ప్రజలు సతమతమయ్యేవారు. ‘వాన రాకడ… కరెంట్ పోకడ… ఎవరూ చెప్పలేరన్నట్లుగా ఉండేది తెలంగాణ రాక ముందు పరిస్థితి. విద్యుత్ కోతలు లేకుండా పూటగడిచేది కాదు. వ్యవసాయానికైనా, గృహ, వ్యాపార, వాణిజ్య అవసరాలకైనా విద్యుత్ కటకట తీవ్రంగా వేధించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో పవర్ సర్ప్లస్ స్టేట్గా తెలంగాణ వెలుగుతున్నది. నిరంతర విద్యుత్ను ప్రజలకు అందించడంతోపాటు బడుగు, బలహీనవర్గాలకు ఉచిత విద్యుత్ పథకాలను సైతం ప్రభుత్వం అమలుల్లోకి తెచ్చింది. దళిత, గిరిజనులకు 101 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నది.
43,569 దళిత, గిరిజన కుటుంబాలకు మేలు..
ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతినెలా 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను వాడుకునే సౌకర్యం కల్పించింది. నిజామాబాద్ జిల్లాలో లక్షలాది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్నాయి. వీరిలో ఇప్పటి వరకు 48,640 కుటుంబాలు ఈ పథకానికి దరఖాస్తులు సమర్పించగా ప్రస్తుతం 43,569 కుటుంబాలకు మేలు చేకూరుతున్నది. ఉచిత విద్యుత్ పథకంలో 29,442 దళిత కుటుంబాలు, 14,127 గిరిజన కుటుంబాలు పైసా కరెంట్ బిల్లు చెల్లించకుండానే విద్యుత్ను వాడుకుంటున్నాయి. సర్కారు కల్పిస్తున్న ఈ ఉచిత విద్యుత్ పథకానికి అర్హులైన వారంతా కుల ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత ఏఈకి లేదా ఈఆర్వో కార్యాలయంలో సమర్పిస్తే సరిపోతున్నది.
దళితవాడల్లో విద్యుత్లైన్ల పునరుద్ధరణ..
నిజామాబాద్ జిల్లాలోని 530 గ్రామపంచాయతీల్లో 563 దళితవాడలు, 245 గిరిజన ఆవాసాలున్నాయి. ఈ ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కొత్తగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 133.99 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు, 254 ట్రాన్స్ఫార్మర్లు అవసరమున్నట్లుగా గుర్తించారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా కరెంట్ సమస్యలు కనిపించకుండా పోయాయి. వంగిన స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేసి పరిష్కరించారు.
కొండంత అండగా కేసీఆర్..
కులవృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వారికి కేసీఆర్ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఉచిత విద్యుత్ పథకం రజక, నాయీబ్రాహ్మణ కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నది. లాండ్రీలు, సెలూన్లకు కరెంట్ బిల్లు బాధలను తప్పించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ సత్ఫలితాలను అందిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోలో లేకున్నప్పటికీ ఆయా కుటుంబాల పరిస్థితిని గమనించిన సీఎం.. వారి మేలు కోసం తీసుకొచ్చిన ఉచిత విద్యుత్ పథకం ఎంతో మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నది. గతంలో వాణిజ్య కేటగిరీలో ఉండడంతో సెలూన్, లాండ్రీ, దోభీఘాట్ నిర్వాహకులు కరెంట్ బిల్లుతో సతమతమయ్యే వారు. అయితే కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన పథకంతో విద్యుత్ బిల్లుల భారం పూర్తిగా తొలగిపోయింది. సెలూన్, దోభీఘాట్, లాండ్రీ షాపులకు ఉచితంగానే 250 యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లావ్యాప్తంగా రజక కులస్తులకు చెందిన 1508 లాండ్రీలు, దోభీఘాట్లకు, నాయీబ్రాహ్మణులకు చెందిన 2057 సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 3,585 మందికి లబ్ధి కలుగుతున్నది.
కనిపించని ధర్నాలు.. రాస్తారోకోలు..
రాష్ట్ర ఏర్పాటుకు ముందు వేసవి కాలం వచ్చిందంటే ప్రతి రోజూ రైతుల ధర్నాలతో రోడ్లన్నీ బిజీగా ఉండేవి. కరెంటు కోతలతో పల్లె, పట్టణాల ప్రజలు ఇబ్బందులుపడేవారు. ఇండ్లల్లో ఇన్వర్టర్లు, వ్యాపార సంస్థల్లో జనరేటర్లు రాజ్యమేలేవి. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తు కోసం ధర్నాలు, రాస్తారోకోలు కనిపించడం లేదు. నిరాటకంగా సరఫరా అవుతున్న నాణ్యమైన విద్యుత్తో ప్రజలంతా హాయిగా ఉంటున్నారు. వేసవిలోనూ 24గంటలపాటు కరెంటు సరఫరా అవుతున్నది.
3లక్షలకు చేరువవుతున్న వ్యవసాయ కనెక్షన్లు
నిజామాబాద్ జిల్లాలో 1,79,800 , కామారెడ్డి జిల్లాలో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2,75,701 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతున్నది. గతంలో పల్లెల్లో పండుగలు, ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటి పూట అరగంట కరెంట్ కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగులు, ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉన్నది. గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల వరకు ఏకబిగిన కరెంట్ కోతలుండేవి. పవర్ హాలీడేలు కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచితం విద్యుత్ అందించే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లింది. పవర్ జనరేషన్, అందుకు తగిన విధంగా సరఫరా, డిస్కమ్ల ద్వారా పంపిణీ.. ఇవన్నీ రెండింతలకు పైగా అభివృద్ధి చేసుకోవడంతోనే ఉచిత విద్యుత్ ఆటంకాల్లేకుండా సాగుతున్నది. కారు చీకట్లు వీడిపోయాయి. కరెంట్ కష్టాలు తొలగిపోయాయి. నిరంతర విద్యుత్ సరఫరాతో సాగు సంబురంగా మారింది. బీడు భూములకు కొత్త కళ వచ్చింది. ఏటేటా అంచనాలకు మించి పంటలు సాగవుతున్నాయి. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో దండిగా దిగుబడులు వస్తున్నాయి. కేసీఆర్ సంక్షేమ పాలనకు ఇదో గీటురాయి.
సాఫీగా త్రీఫేజ్ కరెంట్..
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంతం విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. సాగుకు 6 గంటల కరెంట్ అది కూడా 2, 3 లేదా 4 విడుతలుగా వచ్చేది. ఆ కరెంట్తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేవారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చే త్రీఫేజ్ కరెంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసే వారు. ఒక్కసారిగా మోటర్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ప్యూజులను మార్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులెందరో. ఇలా సమైక్య పాలనలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా అయినప్పటికీ, ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియని పరిస్థితి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చే ది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో ఆర్థికంగా రైతన్నలు అవస్థలు పడ్డారు. బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నా పంటలకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే, కరెంట్ కష్టాలు తొలగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదేండ్లుగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా సవ్యంగా సరఫరా అవుతున్నది. గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై అదనపు భారం పడి మోటర్లు కాలిపోయేవి. మోటరు కాలిపోతే వాటికి మరమ్మతులు చేయించాలంటే సగటున ఒక్కో రైతుకు రూ.2 వేల వరకు భారం అయ్యేది. చేసేది లేక అప్పు తీసుకువచ్చి రిపేర్లు చేయించేది. ఇప్పుడలాంటి ఘటనలే లేకుండా పోయాయి.
రెండు పంటలు పండుతున్నాయి
గాంధారి, జూన్ 4: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రెండు పంటలు పండుతున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుండెనో, ఎప్పుడు పోతుండెనో తెలిసేది కాదు.ప్రస్తుతం నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో రెండు పంటలు పండిస్తున్నాము.
– బొల్లారం రమేశ్, రైతు, గౌరారం
రాత్రిపూట పోయే బాధ తప్పింది.
గాంధారి, జూన్ 4: కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో పొలాల్లోని బోర్లను స్టార్ట్ చేయడానికి రాత్రి పూట పోయే బాధ తప్పింది. గతంలో బోరుబావులకు కరెంట్ సరిగా రాకపోవడంతో బోరుమోటర్లతోపాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. దీంతో పంటలు సరిగా పండక, ఎండిపోయేవి. ఇప్పుడు గా బాధ తప్పింది.
– మెగావత్ పండిత్, వెంకటాపూర్ తండా
రంది లేకుండా కరెంట్ సరఫరా
లింగంపేట, జూన్ 4: వ్యవసాయానికి రంది లేకుండా కరెంటు వస్తుంది. నాకు టైం ఉన్నప్పుడు పొలం కాడికి పోయి మోటరు చాలు చేసుకుంటున్న. కరెంట్ మంచిగా రావడంతో పంటలు కూడా మంచిగా పండుతున్నాయి. ఇంతకు ముందులాగా కరెంట్ కోసం ఎదురు చూసుడు లేకుండా పోయింది. పొద్దుగాళ్ల జరసేపు, రాత్రికి జరసేపు కరెంట్ వస్తుండే. కరెంట్ ఫ్రీగా ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా.
-కోరే సాయిలు, కోమట్పల్లి, లింగంపేట
రాత్రి మోటరు కాడ పంటుంటి..
లింగంపేట, జూన్ 4: తెలంగాణ రాక ముందు మోటరు చాలు చేస్తందుకు పోయి ఆడనే పండాల్సి వస్తుండే. కేసీఆర్ సార్ వచ్చినంక కరెంట్ కోసం ఎదురుచూసుడు లేదు. నీళ్లు పెట్టేందుకు పోయి ఇంటికి వచ్చేదాక ఇంటికాడ ఎదురు చూస్తుండే. ఇంటికి వచ్చుడు ఆలస్యం అయితే ఏమైందోనని ఇంటికేంచి పొలం కాడికి ఉరికి వస్తుండే. రాత్రి పోవాలంటే పురుగు,బుషితోని భయం అయ్యేది. ఇప్పుడు ఫ్రీ కరెంట్తోని పంటలు మంచిగా పండుతున్నాయి.
-ఎంకీ రాజయ్య, శెట్పల్లి, లింగంపేట