బాన్సువాడ టౌన్, అక్టోబర్ 28 : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణానికి చెందిన ప్రకాశ్ మద్నూర్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నాడు.
భార్య లక్ష్మి (50), కూతురు శిరీష (21) చిన్న కూతురు మానసతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి కర్నూల్ మీదుగా తిరుపతికి బయల్దేరారు. ధర్మారం స్టేజీ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో లక్ష్మి, శిరీష అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశ్, మానసకు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.