కంఠేశ్వర్/ కామారెడ్డి, జనవరి 25 : ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటుహక్కు ప్రాధాన్యతను ప్రతిఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతోపాటు ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మనకు నచ్చిన నాయకులను ఎన్నుకునే అవకాశం కేవలం ఓటు హక్కు ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు.
ఒక్క ఓటుతో ఏమవుతుందనే భావన ఎంతమాత్రం సరికాదని, ప్రజాస్వామ్య పరిరక్షణలో మంచి పాలకులను ఎన్నుకోవడంలో ప్రతిఓటూ ఎంతో కీలకమని తెలిపారు. అనంతరం ఓటు వినియోగించుకుంటున్న సీనియర్ సిటిజన్లను, కొత్తగా నమోదైన యువ ఓటర్లను జిల్లా యంత్రాంగం తరఫున జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఓటు హక్కుపై వేసిన ముగ్గు ఆలోచింపజేయగా.. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.