ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 68.30 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ గడువు ముగిసే సమయానికి ఇంకా లైన్లలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటింగ్ ముగిసే సమయానికి రాత్రి ఏడు గంటలు దాటింది. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, జుక్కల్, బోధన్ నియోజకవర్గాల్లో పోలింగ్ బాగానే నమోదు కాగా నిజామాబాద్ అర్బన్లో తక్కువగా నమోదైంది.
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మహిళలు, వృద్ధులతో పాటు యువ ఓటర్లు ఉత్సాహంగా కదిలొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. గెలుపు తమదేనని ఓటేసినంత అనంతరం ధీమా వ్యక్తం చేశారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు రంగంలోకి దిగి అల్లరి మూకలను చెదరగొట్టారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు.. ఈ నెల డిసెంబర్ 3న వెలువడనున్నది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. యువత, వృద్ధులు, దివ్యాంగులతోపాటు కొత్తగా ఓటుహక్కును నమోదు చేసుకున్న వారు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలవారు ఓటేసేందుకు ముందుండడం విశేషం. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్ధం అధికారులు వీల్చైర్లు, వాహనాలు తదితర సదుపాయాలు కల్పించారు.
ఆదర్శ పోలింగ్ కేంద్రాలతోపాటు మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బూత్లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకుకొని స్ఫూర్తి చాటారు. కొన్ని కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా.. ఓటు వేసేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం ఐదు గంటల వరకు క్యూలో ఉన్న ప్రతిఒక్కరికీ అధికారులు ఓటు వేసేందుకు అనుమతిచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. బందోబస్తును సీపీ కల్మేశ్వర్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.