కమ్మర్పల్లి, నవంబర్ 16 : కాంగ్రెస్, పార్టీవి వట్టి మాటలు..కరెంటు కోతలేనని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కర్ణాటకలో గానీ వ్యవసాయానికి కడుపు నిండా కరెంటు ఇచ్చిన చరిత్ర లేదన్నారు. అలాంటి పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని కోరారు. రాజ్య సభ సభ్యుడు కే.ఆర్. సురేశ్రెడ్డితో కలిసి కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, బషీరాబాద్ గ్రామాల్లో గురువారం మంత్రి ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వ్యవసాయానికి కరెంటు పరంగా ప్రోత్సాహం లేదన్నారు. కర్ణాటకలో 10 గంటల కరెంటు ఇస్తామని ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఏడు గంటల కరెంటును ఎగ్గొట్టారన్నారు. ఇటు మహారాష్ట్రలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం.రూ.లక్షా 80 వేల డీడీ చెల్లించాలని.. కరెంటు బిల్లు కూడా కట్టాలని తెలిపారు. కానీ తెలంగాణలో కనెక్షన్ కోసం రూ.6 వేల డీడీ మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పంట పెట్టుబడిగా ఉల్టా పైసలు ఇస్తూ ఉచితంగా కరెంటు ఇస్తున్నారన్నారు. పని చేయక పోతే ప్రజలు ఓటు వేయకుండా వీపు సాఫ్ చేస్తారనే భయం ఉండాలని, అలాగే పని చేసే వారికి ఓటుతో వెన్ను తడతారన్న భరోసా ఉండాలన్నారు. మూడో సారి పార్టీ అధికారంలోకి రాగానే కొత్త బీడీ పీఎఫ్ వచ్చిన వారికి బీడీ పింఛన్ మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
రుణ మాఫీపై విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అందరికీ మాఫీ బాధ్యత తనది, సురేశ్ రెడ్డిదని భరోసా ఇచ్చారు. చౌట్పల్లి గ్రామం తన సొంత గ్రామం లాంటిదన్నారు. చౌట్పల్లిలో సబ్ స్టేషన్ నిర్మించి రెండు గ్రామాల చిరకల వాంఛ నెరవేర్చానని తెలిపారు. బషీరాబాద్ మాటు కాలువ గండ్లు పడుతున్న చోట సీసీ లైనింగ్ వేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బషీరాబాద్లో రెండు పంటలకు హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు జలాలు సంపూర్ణంగా అందించే బాధ్యత తనదేనన్నారు. రెండు గ్రామాల్లో తాను అందించిన అభివృద్ధి కండ్ల ముందే ఉందని..కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి గెలిపిస్తే రెట్టింపు సేవలు అందిస్తానన్నారు. ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్యేకంగా మన గ్రామాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంతో అభివృద్ధిని అందించాడని.. మళ్లీ గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. రేవంత్ రెడ్డి తాను వేటాడడానికి వచ్చానంటూ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడని.. తెలంగాణను సైనికుడి లాగా కాపాడుతున్న కేసీఆర్పై ఈగ వాలినా ప్రజలు సహించబోరన్నారు. రేవంత్ తుపాకీ రామన్న లాంటి వేటగాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాదవులు గొర్రె పిల్లను, గంగ పుత్రులు చేపలను బహూకరించారు.