కమ్మర్పల్లి, నవంబర్ 14 : ‘గత ఎన్నికల సమయంలో సాగు నీటి ఇబ్బందుల కారణంగా ఉప్లూర్ రైతులు తనను కోపగించుకున్నారు..అప్పుడే ఉప్లూర్ బాల రాజేశుడి ఆలయం ఎదుట ప్రమాణం చేసి చెప్పాను..చెప్పిన విధంగా ఎస్సారెస్పీ వరద కాలువను..కాకతీయ కాలువను మూడు కాలాలు నిండుగా ఉంచుతూ రెండు పంటలకు సాగు నీటి సౌకర్యాన్ని శాశ్వతంగా కల్పించాను’ అని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దీనిని రైతులు, ప్రజలు గుర్తించి తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.మంగళవారం సాయంత్రం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంతోపాటు నాగాపూర్, ఉప్లూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చినా ఏమి చేయ లేదన్నారు. మళ్లీ ఒక చాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. మిషన్ భగీరథ ఫలితాలకు ఉప్లూర్ గ్రామం చక్కని నిదర్శనమని పేర్కొన్నారు. రూ.3 కోట్లతో మిషన్ భగీరథ కింద ఉప్లూర్ మహిళల తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా దూరం చేశామని చెప్పారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, నాలుగు లైన్ల రోడ్డు అభివృద్ధికి తార్కాణమని పేర్కొన్నారు.మినీ స్టేడియం నిర్మించి యువత దశాబ్దాల కల నెరవేర్చినట్లు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని, తనను మరో సారి గెలిపించాలని వేముల కోరారు.