శిథిలావస్థకు చేరిన భవనాలు.. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడిన సర్కారు బడులు ప్రస్తుతం కార్పొరేట్కు దీటుగా మారాయి. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన మన ఊరు – మన బడి, మన బస్తీ- మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో 351 పాఠశాలల్లో సుమారు రూ.165 కోట్ల ఖర్చుతో కొత్త భవనాలను నిర్మించడంతో పాటు ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ఎంఆర్సీ భవనాలు, టాయిలెట్స్, సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సువిశాలమైన ప్రాంగణాలు, కిచెన్స్, డైనింగ్ హాల్స్, ప్రధానోపాధ్యాయుల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. మన ఊరు -మనబడిలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో రూ.1.86 కోట్లతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి నేడు ప్రారంభించనున్నారు.
కామారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడులకు మహర్దశ పట్టింది. కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో 351 పాఠశాలల్లో సుమారు రూ.165 కోట్ల ఖర్చుతో కొత్త భవనాలు నిర్మించడంతోపాటు మౌలిక వసతులను కల్పించడానికి రూపకల్పన చే శారు. 234 పాఠశాలలకు రూ.4.37 కోట్ల నిధులు సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖాతాల్లో జమ చేశారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదు లు, ఎంఆర్సీ భవనాలు, టాయిలెట్స్, సైన్స్ ల్యా బ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సువిశాలమైన ప్రాంగణా లు, కిచెన్స్, డైనింగ్ హాల్స్, ప్రధానోపాధ్యాయుల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగం గా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో రూ.1.86 కోట్లతో నిర్మించిన ఆధునిక భవనాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విచ్చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి ఆమె భవనాన్ని ప్రారంభిస్తారు.
శిథిలావస్థ నుంచి ఆధునిక భవనాల్లోకి..
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల గురించి పట్టించుకునే నాథుడే లేడు. దశాబ్దాల క్రితం నిర్మించిన పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరడం, పెచ్చులూడడం జరిగింది. ఎన్నో పాఠశాలలు కుప్పకూలాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించేందుకు వేల కోట్లను కేటాయించారు. అదనపు గదు ల నిర్మాణం, శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం తరగతులను ప్రారంభించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై భరోసా ఏర్పడుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో రోజురోజుకూ అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం, ఈసారి కొత్తగా రాగి జావ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నది.
జిల్లాలో పాఠశాలల వివరాలు
కామారెడ్డి జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 682, ప్రాథమికోన్నత పాఠశాలలు 124, ఉన్నత పాఠశాలలు 182, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, కేజీబీవీలు 19, మినీ గురుకులాలు 2, మైనారిటీ గురుకులాలు 6, మోడల్ స్కూళ్లు 6, సాంఘిక సంక్షేమ గురుకులాలు 11, గిరిజన గురుకులాలు 3, ఆశ్రమ పాఠశాలలు 3, ఇతర పాఠశాలలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది మొత్తం 1,58,582 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. 2022-23 విద్యాసంవత్సరంలో టెన్త్లో 295 పాఠశాలల నుంచి 11,899 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతంలో 49 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తే, 2022-23లో 112 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచింది.
సన్నబియ్యంతో భోజనం
మన ఊరు- మనబడి, మన బస్తీ- మనబడిలో భాగంగా కామారెడ్డి జిల్లాలో మొదటి దశలో 351 పాఠశాలలను సుమారు రూ.165 కోట్ల ఖర్చుతో భవనాలు నిర్మించి, మౌలిక వసతులను కల్పించారు. రూ.30లక్షల అంచనా వ్యయం కన్నా తక్కువ గల 235 పాఠశాలలు, రూ.30 లక్షల కన్నా అధికంగా అంచనా గల 116 పాఠశాలలను గుర్తించి పనులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 220 పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రతీ మండలంలో 2 చొప్పున 46 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా గుర్తించి పనులు చేపడుతున్నారు. అలాగే 137 అదనపు తరగతి గదులు, ఎంఆర్సీ భవనాలు, టాయిలెట్లు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ టీవీలు ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.125 కోట్లను ఖర్చు చేశారు. 2023-24 సంవత్సరానికి గాను డైరెక్టర్ నేషనలైజ్డ్ టెక్ట్స్ బుక్స్ను చైల్డ్ ఇన్ఫో ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు. దీని కోసం జిల్లాకు రూ.వంద కోట్లు కేటాయించారు.
ఎఫ్ఎల్ఎన్తో మెరుగైన విద్య
తొలిమెట్టు కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించారు. గుణాత్మక విద్యను, ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు 24 మండల స్థాయి మానిటరింగ్ అధికారులు, 61 మంది కాంప్లెక్స్ నోడల్ అధికారులను నియమించారు. జిల్లా స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ అమలు ద్వారా విద్యార్థుల చదువులో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నారు. అలాగే ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు.
ఉత్తమ విద్యను అందించడమే ధ్యేయం
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పాఠశాలలు, విద్యాబోధనను మెరుగుపర్చింది. వందల కోట్లతో జిల్లాలో భవనాలను నిర్మిస్తున్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. బడి బాట ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు చేరారు. అడ్మిషన్లకు ఇంకా సమయం ఉంది. వీటి సంఖ్య మరింత పెరగనున్నది.
-రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి
ఆధునిక హంగులతో భవన నిర్మాణం
జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. రూ.1.86 కోట్లతో నిర్మించిన భవనం ఎంతో సువిశాలంగా కనిపిస్తున్నది. ఈ భవనంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-టి.చంద్రకాంత్, హెచ్ఎం, పెద్ద కొడప్గల్