జక్రాన్పల్లి, జనవరి 4 : సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే తపన ప్రతిఒక్కరిలో ఉండాలని, ఆ దిశగా ముందుకు సాగినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సమాజం ఆవిష్కృతమవుతుందన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద రూ.62.77 లక్షల ప్రభుత్వ నిధులతో పాటు దాతలు పెద్ద ఎత్తున సమకూర్చిన విరాళాలతో నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన సముదాయాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ముందుగా సరస్వతీ మాత విగ్రహానికి పూజలు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల నిర్మాణానికి సింహాభాగం విరాళాలను అందిం చి తన దాతృత్వాన్ని చాటుకున్న పైపుల రాజిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర దాతలను సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతృత్వం అంటే ఎలా ఉండాలనడానికి పైపుల రాజారెడ్డి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సామాన్య ప్రజలకు ఉపయుక్తంగా నిలుస్తున్న ఆరోగ్యశ్రీ సేవలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వ బడులపై తప్పనిసరిగా ఆలోచన చేస్తూ వాటి అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అంకిత భావంతో కృషి చేయాలన్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దాత రాజిరెడ్డి పెద్ద ఎత్తున తోడ్పాటునందించడం అభినందనీయమన్నారు. అంతకుముందు జక్రాన్పల్లి శివారులోని దేవుని తండాలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఆర్డీవోలు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలను నిర్మించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. కాగా డిచ్పల్లిలో మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఇందల్వాయిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరగా మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు.