కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/బాన్సువాడ, జూన్ 9 : కేసీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లి ఎక్స్రోడ్డు వద్ద శుక్రవారం సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతి పోచారం హాజరయ్యారు. ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా సంక్షేమ పథకాలను కూలంకశంగా వివరిస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రసంగించారు. దేశంలో అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిన ఘనత తనదేనన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో గూడులేని ప్రతి పేదకూ ‘డబుల్’ ఇల్లును మంజూరుచేశానని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇది ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉన్న వారికి వందశాతం రాయితీపై రూ.3లక్షలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువ మందికి పింఛన్లను అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఏ దేశం, ఏరాష్ట్రంలోనూ రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు లేవని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతును రాజుగా మార్చడానికి రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. మొత్తం తెలంగాణలోని సంక్షేమ పాలనను చూస్తోందని, కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్తో దేశం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. దేశం కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు.
బీసీలు 20లోపు దరఖాస్తు చేసుకోవాలి
బీసీ కులాల వారు ఈనెల 20వ తేదీలోపు రూ.లక్ష ఆర్థికం సయం కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పీకర్ సూచించారు. ఈనెల 26న పోడు పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. అనంతరం స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ కారణంగా ఎంతో లబ్ధి పొందామని, వారికి జీవితాంతం రుణపడి ఉంటామని కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. రాష్ట్రంలో 80శాతం మంది సంక్షేమ పథకాలను పొందారని స్పీకర్ వివరించారు. ఒక్క నస్రుల్లాబాద్ మండలంలోనే 19700 జనాభా ఉండగా, 18600 మంది వివిధ సంక్షేమ పథకాలను పొందారని చెప్పారు.
సంక్షేమంలో మనమే ఫస్ట్:డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. స్పీకర్ పోచారం కృషితో 11వేల ఇండ్లు నిర్మించుకున్నామని, ఇది రికార్డును సాధించిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి ముందుగా స్పీకర్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కన్నీటి పర్యంతమైన స్పీకర్
సంక్షేమ సంబురాలు కార్యక్రమాన్ని బొమ్మన్దేవ్పల్లిలో ఉన్న వెంకటసాయి స్కూల్ ఆవరణలో ఆర్భాటంగా నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండలంలో పథకాలు పొందిన వారికి ప్రత్యేక ఐడీ కార్డులు అందజేశారు. సమావేశంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి జీవిత చరిత్రను ప్రదర్శించగా, స్పీకర్ తిలకించి కన్నీటి పర్యంతమయ్యారు. సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చడంపై భావోద్వేగానికి గురయ్యారు.