నిజామాబాద్ క్రైం, జనవరి 1: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. కమిషనరేట్లో అదనపు డీసీపీ జయరాం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 31న నడిపల్లి తండా వద్ద టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో స్కోడా కారులో అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని ఆపి తనిఖీ చేశారు. కారులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లా (ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి)కు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లా (ప్రస్తుతం హైదరాబాద్ మణికొండ)కు చెందిన షేక్ ఖాజా మొహినుద్దీన్ అనే ఇద్దరు మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. కారు డ్యాష్ బోర్డులో 3ప్లాస్టిక్ కవర్లలో కోన్ ఆకారంలో ఉన్న ముక్క లభ్యం కాగా వాటిని క్లూస్టీమ్ పరిశీలించగా ఎండీఎంఏ అనే మత్తు పదార్థంగా గుర్తించారు.
మరో కవర్లో తెల్లని ముద్ద కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. కారు వెనుక భాగంలో మరో కవర్లో గంజాయి పౌడర్ను గుర్తించినట్లు అదనపు డీసీపీ వెల్లడించారు. ఎండీఎంఏ డ్రగ్ 3.2 గ్రాములు,కొకైన్ 12.3 గ్రాములు, గంజా పౌడర్ 3.1 గ్రాములు ఉంది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా, మైక్ అనే వ్యక్తి నుంచి న్యూ ఇయర్ కోసం ఈ మత్తు పదార్థాలు తీసుకువస్తున్నట్లుగా అంగీకరించారని తెలిపారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. కారుతోపాటు సెల్ఫోన్లను సీజ్ చేశామన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్,టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, ఇన్స్పెక్టర్లు అజయ్బాబు,అంజయ్యతోపాటు డిచ్పల్లి సీఐ కృష్ణ, ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.