పేదింటికి ‘గృహలక్ష్మి’ రానున్నది. సొంతింటి కల త్వరలోనే నెరవేరనున్నది. డబుల్ బెడ్రూం ఇండ్లతో దేశం దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి గూడు కల్పించింది. బాన్సువాడలో 11 వేలకు పైగా ఇండ్లు, మిగతా 8 నియోజకవర్గాల్లోనూ వందలాది డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించింది. కొన్ని మినహా ఇప్పటికే వేలాది మంది నిరుపేద లబ్ధిదారులకు నివాసాలు అప్పగించగా, వారు సంతోషంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇక, సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారి కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. గృహ నిర్మాణం కోసం మూడు లక్షల ఆర్థిక సాయం అందించనున్నది. ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించగా భారీ స్పందన లభించింది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తిచేశారు. ఇక లబ్ధిదారులను ఎంపిక చేయడమే మిగిలింది. తొలివిడుతలో ఒక్కో నియోజకవర్గంలో 3 వేల చొప్పున తొమ్మిది నియోజకవర్గాల్లో మొత్తం 27 వేల మందికి ఆర్థిక సాయం అందనున్నది. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దశల వారీగా అర్హులైన వారందరికీ ఆర్థికసాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమ సొంతింటి కల నెరవేరుతుందని పేద, మధ్యతరగతి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
ఖలీల్వాడి సెప్టంబర్ 13 : ఇల్లు కట్టుకోవాలనే పేదల కలలు సాకారం కాబోతున్నాయి. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘గృహలక్ష్మి’ పథకం కింద సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.3లక్షలను మూడు విడుతల్లో లబ్ధిదారుల ఖాతాలో నేరుగా వేయనున్నది. ఇందుకోసం తొలి విడుత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. సర్వే చేసి అర్హులైన వారి లెక్క తేల్చారు. నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గానికి 3వేల మందికి చొప్పున 15 వేల మందికి మొదటి విడుత సహాయాన్ని విడుతల వారీగా అందించనున్నది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 30వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. పారదర్శకంగా పథకం అమలయ్యేలా సర్కారు చర్యలు చేపట్టింది.
స్థానికులై ఉండి ఆహార భద్రత కార్డు కలిగిన వారు, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు గృహలక్ష్మి పథకానికి అర్హులవుతారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది గ్రామాలు, పట్టణల్లోని వార్డుల్లో దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడుత లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ వెంటనే ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సొంత స్థలాలు కలిగి ఉండి ఏండ్లుగా ఇంటి నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న వారి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తుండడంతో పేదవర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
గృహలక్ష్మి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తుల విచారణ ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. మండలాల పరిధిలో ఎంపీడీవో, ఎంపీవో రెండు బృందాల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్లో వారి స్థితిగతులను విచారించారు. భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల్లో జత చేసిన డాక్యుమెంట్లు సరైనవా, లేవా అని ప్రత్యేక బృందాలు సర్వే చేశాయి. స్వీకరించిన వెంటనే శరవేగంగా సర్వే ప్రక్రియను పూర్తి చేసి అర్హుల లెక్క తేల్చడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గృహలక్ష్మి పథకం ఇండ్ల మంజూరీలో ముఖ్యంగా స్థలం ఉండి ఇల్లు లేని దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, గుడిసెలు, పాకలు, రేకుల ఇండ్లు, అద్దె ఇండ్లలో నివాసముండే పేదలను తొలి విడుత లబ్ధిదారుల ఎంపిక జాబితాలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ పథకంలో భాగంగా పేదలు తమకున్న సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. ఎంపికైన లబ్ధిదారుడు మూడు విడుతల్లో నిధులను పొందవచ్చు. ఇందులో భాగంగా బేస్మింట్ లెవల్లో రూ.లక్ష, రూఫ్ లెవల్లో రూ. లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేస్తారు. లబ్ధిదారుడు ఇంటిని తనకు నచ్చిన విధంగా నిర్మించుకోవచ్చు. గతంలో మాదిరిగా ఆర్సీసీ(స్లాబ్) కట్టుకోవచ్చు. నిర్ణీత విస్తీర్ణంలో నిర్మించుకోవాలనే నిబంధనలేవి ఏమీ లేవు. ఫలితంగా పేదలు తమకు ఉన్న స్థలంలో ఇష్టమైన రీతిలో ఇంటిని కట్టుకోవచ్చు.