కామారెడ్డి/కంఠేశ్వర్, ఏప్రిల్ 4: తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డా.శరత్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్ కార్యాలయాల్లో గురువారం వేర్వేరుగా తాగునీటి ఎద్దడి నివారణపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్, మండల స్థాయిలో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలానికీ జిల్లాస్థాయి అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించాలన్నారు.
మండల స్థాయి అధికారులను క్లస్టర్ అధికారులుగా నియమించి వారం రోజులకోసారి తాగునీటి ఎద్దడిపై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని 842 ఆవాసప్రాంతాలకు తాగునీరందేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. సమావేశాల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్రెడ్డి, చంద్రమోహన్, అంకిత్, కిరణ్కుమార్, మున్సిపల్ కమిషనర్లు సుజాత, మకరంద్, ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.