Bajireddy Govardhan | డిచ్పల్లి, అక్టోబర్ 25 : గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్నికల సమయంలో కొందరు కొత్త బిచ్చగాళ్లలాగా గ్రామాల్లోకి వచ్చి మాయమాటలు చెబుతారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేములప్రశాంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలు, గిరిజన తండాలకు బీటీ రోడ్లు వేశామన్నారు. ఇజ్రాయిల్ టెక్నాలజీతో మంచిప్ప రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, పూర్తయితే బీడు భూములకు సాగు నీరందుతుందని తెలిపారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్తో పాటు డివైడర్ మధ్యలో రకరకాల మొక్కల పెంపకం ప్రయాణికులను ఆకట్టుకుంటున్నదన్నారు. డిచ్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్పల్లిలో వంద పడకల దవాఖాన, చీమన్పల్లిలో పీహెచ్సీ, చెక్డ్యామ్లు, వంతెనలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు నిర్మించినట్లు వివరించారు. చారిత్రక నిలయమైన డిచ్పల్లి ఖిల్లా రామాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.63 కోట్ల నిధులతో చేపట్టిన మాధవ్నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. ఆర్వోబీ నిర్మాణం పూర్తయితే నిజామాబాద్ -హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు మొదటి విడుత దళితబంధు పంపిణీ చేశారని, రూరల్ నియోజకవర్గంలో 1109 మంది లబ్ధిదారులకు రెండో విడుత దళితబంధు సైతం పంపిణీ చేసినట్లు చెప్పారు.
గృహలక్ష్మి పథకం కింద 3 వేల మందికి రూ. 3 లక్షల చొప్పున మొత్తం రూ. 90 కోట్లు మంజూరు చేసి పత్రాలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. 1100 మంది దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.110 కోట్లు అందజేశామని వెల్లడించారు. ధర్పల్లి మండలకేంద్రంలో రూ.33.15 కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు, సిరికొండ మండలం చీమన్పల్లిలో రూ.2.50 కోట్లతో పీహెచ్సీ నిర్మాణ పనులు, సిరికొండ మండల కేంద్రంలో రూ.5 కోట్లతో ఐటీఐ మంజూరు, డిచ్పల్లి మండలకేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.26 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణం, రూ.25 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు, మైనార్టీ బంధులో భాగంగా 300 మందికి రూ.లక్ష చొప్పున రూ.3 కోట్లు, బీసీ బంధులో భాగంగా 200 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రూ.2 కోట్లు మంజూరు చేశామని వివరించారు. వీటితో పాటు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, వంతెనలు, డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామని, రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, గొర్రెల పంపిణీ పథకాలను రూ.1500 కోట్లకు పైగా నిధులు వెచ్చించి, లబ్ధిదారులకు అందజేశామని వివరించారు.