మాక్లూర్, ఏప్రిల్ 30: అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, ఆ పార్టీ నాయకుల మోసపూరిత మాటలను నమ్మవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన మాక్లూర్ మండలంలోని అడవి మామిడిపల్లి, ఆలూర్ మండలంలోని గుత్ప గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ..పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు. పేదలు, రైతులకు సంక్షేమ పథకాలు పక్కాగా అందాయని గుర్తుచేశారు. రైతులకు వరికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు నోరెత్తడం లేదని విమర్శించారు. ప్రజలను అబద్ధాలతో ఆగంచేసే కాంగ్రెస్, బీజేపీ కావాలా.. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, మాజీ సర్పంచులు మల్లారెడ్డి, లింగన్న, రఘురావు, నాయకులు గణపతినాయక్, గోపు రంజిత్, గంగాధర్, పుణ్యరాజ్ పాల్గొన్నారు.