వర్ని/బాన్సువాడ, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజక వర్గం దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడలోని తన నివాసంలో 117 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. వర్ని మండల కేంద్రంలో 23గ్రామాలకు చెందిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల (రూ.8 కోట్ల 78లక్షల 96వేల 189)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నియోజకవర్గంలో లేనన్ని డబుల్ బెడ్ రూం ఇండ్లను బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మించినట్లు తెలిపారు. సొంత స్థలాల్లో నిర్మించుకునే వారికి ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. దెగ్లూర్, బోధన్ తదితర ప్రాంతాల నుంచి తన వద్దకు వచ్చి అబద్ధాలు చెప్పి ఇండ్లు అడుగుతున్నారని, కొన్నిసార్లు తనకు ఇది బాధ కలిగిస్తుందన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం సీఎం కేసీఆర్ మేనమామల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. బాన్సువాడ నియెజకవర్గంలో ఇప్పటి వరకు 13వందల మంది లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే 11 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసి నిర్మించామని తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలో సింగిల్ బెడ్రూం ఇండ్లను మంజూరుచేస్తున్నారని తెలిపారు. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు వీటిని మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వర్నిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో -ఆప్షన్ మెంబర్ కరీం, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, సహకార సంఘాల అధ్యక్షులు నామాల సాయిబాబా, కృష్ణారెడ్డి, కనకారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, దిలారి బాబు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. బాన్సువాడలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, గంగుల గంగారాం, మహ్మద్ ఎజాస్, పిట్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మల్లారంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన స్పీకర్
వర్ని మండలం మల్లారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మల్లారం సర్పంచ్ కన్నీరాం, వెంకాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాల్యమిత్రుడితో సరదాగా గడిపిన స్పీకర్ పోచారం
బాన్సువాడ రూరల్, మార్చి 17: ఏం కాశన్నా.. బాగున్నావా! ఆరోగ్యం ఎలా ఉంది? ఎంత మంది పిల్లలు.. అంటూ తన బాల్యమిత్రుడిని స్పీకర్ పోచారం ఆప్యాయంగా పలుకరించి ఆలింగనం చేసుకున్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లిన ఆయనకు తన చిన్ననాటి మిత్రుడు చాకలి కాశయ్య ఎదురయ్యాడు. దీంతో ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇబ్రహీంపేట్లో ఇద్దరం కలిసి చదువుకున్నామని స్పీకర్ తెలిపారు. చిన్ననాటి మిత్రుడు పోచారం ఉన్నత స్థానంలో ఉండడం, ఆయనను కలవడం ఆనందంగా ఉన్నదని కాశయ్య తెలిపారు.