భిక్కనూరు, సెప్టెంబర్ 29: రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతుగా కృషి చేస్తున్నాయి. వ్యవసాయంలో కీలకమైన విస్తరణ విభాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఫర్టిలైటర్ దుకాణాల డీలర్లకు దేశీ పేరుతో డిప్లొమా కోర్సును నిర్వహిస్తున్నారు. పంటల సాగులో ఖర్చులు తగ్గించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ సహకారంతో పకడ్బందీగా చేపడుతున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు డిప్లొమా కోర్సు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్నారు.
వ్యవసాయంలో ముఖ్యమైన విస్తరణ విభాగాన్ని పటిష్టం చేసేందుకు, రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు డిప్లొమా కోర్సు (దేశీ)ని అమలు చేస్తున్నారు. సేంద్రియ సాగు పెంచేలా కృషి చేస్తున్నారు. ఎరువులు, విత్తనాల విక్రయ డీలర్లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ (మనేజ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో డిప్లొమా కోర్సును ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారిణి భాగ్యలక్ష్మి పర్యవేక్షణలో ఇప్పటి వరకు 80 మంది డీలర్లకు శిక్షణ కార్యక్రమం పూర్తిచేశారు. శిక్షణ పొందిన డీలర్లలో ఇటీవల 40మంది ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా డీలర్లను, సమన్వయకర్త పెండ్యాల నరేందర్, డీఏవో భాగ్యలక్ష్మి, ఏడీఏ అపర్ణ, ఏవో రాధ, బ్లాక్ మేనేజర్ నవీన్ను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అభినందించారు.
రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా దేశీ శిక్షణ కోసం ఎంపిక చేశారు. కోర్సులో చేరేందుకు ఒక్కో డీలర్ రూ.10వేలు ఆత్మ పేరుతో డీడీ చెల్లించాల్సి ఉంటుంది. స్టడీ మెటీరియల్, రికార్డులు, డ్రెస్కోడ్, ఐడీ కార్డుతోపాటు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారు. వ్యవసాయంలో బీఎస్సీ చేస్తేనే కొత్తవారికి లైసెన్సు జారీ చేస్తున్నారు.
విత్తనం నాటిన నుంచి కోతల వరకు వివిధ దశలపై పాఠాలు బోధిస్తున్నారు. విత్తన, పురుగు మందుల చట్టాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. సమగ్ర పోషక యాజమన్యం, పురుగుల నుంచి పంటలను రక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను నేర్పిస్తున్నారు. సకల వ్యవసాయ విధానాలు, సేంద్రియ వ్యవసాయం తదితర వాటిపై పూర్తి అవగాహన కల్పించేలా 40 తరగతులు, 8 క్షేత్రస్థాయి సందర్శనలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. భిక్కనూరు రైతు వేదికలో ఇప్పటి వరకు 20తరగతులు పూర్తికాగా, వారంలో ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
దేశీ విధానంలో శిక్షణలో పేరు నమోదు చేసుకున్న డీలర్లు కచ్చితంగా 80శాతం తరగతులకు హాజరయ్యేలా నిబంధనలు విధించారు. ప్రతివారం అనుభవజ్ఞులు, సైంటిస్టులతో అంశాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. డీలర్లు తప్పనిసరిగా నాలుగు పరీక్షలతోపాటు చివరగా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైతేనే సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
మనేజ్, ఆత్మ సంయుక్తంగా నిర్వహిస్తున్న డిప్లొమా కోర్సు మూడో విడుతను కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇటీవల ప్రారంభించారు. ఈ దఫా జిల్లాలోని 40మంది విత్తన డీలర్లకు శిక్షణ అందించనున్నారు. ఏడాదిపాటు నిర్వహించే కోర్సులో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల ద్వారా అవగాహన కల్పించనున్నారు.
ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల చట్టాలపై కోర్సులో పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. చట్టాలపై డీలర్లకు తెలిస్తేనే రైతులకు సమాచారం ఇస్తారు. సాగులో ఖర్చులు తగ్గించేలా పంట పొలాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– నరేందర్, కోర్సు సమన్వయకర్త
వారంలో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో ఉండే డీలర్లు.. రైతులకు మెరుగైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించాం. ఆ మేరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం.
– నవీన్కుమార్, బ్లాక్ టెక్నాలజీ మేనేజర్