కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సంపద పెంచినం. సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచినం. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలు, రైతులకు మేలు జరుగుతుంది.పొరపాటున కాంగ్రెస్కు అవకాశమిస్తే మళ్లీ గోసపడుడేనని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే మూడు గంటలే కరెంట్ ఉంటుందని, 24 గంటలు కరెంట్ కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ధరణిని ఎత్తేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణి ఎత్తేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని హెచ్చరించారు. ధరణి కావాల్నా.. దళారులు కావాల్నా ప్రజలు ఆలోచన చెయ్యాలని కోరారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం డిచ్పల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ చేసిన వైఫల్యాలు, బీఆర్ఎస్ సాధించిన విజయాలను సవివరంగా ప్రజల ముందుంచారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో చర్చ పెట్టాలి.. ఓటు వజ్రాయుధం లాంటిది. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ ఆగమైతమని, అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/డిచ్పల్లి : తెలంగాణ వచ్చే నాటికి చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లుగా ఉండగా.. పదేండ్లపాటు రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చినట్లుగా వివరించారు. రాష్ట్రం వచ్చిన కొత్తలో మూడునాలుగు నెలల పాటు మేధావులతో చర్చించి ప్రస్థానాన్ని మొదలు పెట్టామన్నారు. దగాపడిన రైతు మేలు కోసం వ్యవసాయాన్ని స్థిరీకరించినట్లు తెలిపారు. డిచ్పల్లి మండలం గాంధీనగర్ సమీపంలో గురువారం నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంపద ఎట్లా పెరిగితే అట్లా ఫించన్లను రూ.200 నుంచి రూ.2వేలకు చేశామని తెలిపారు. రాబోయే ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికీ బీమా సౌకర్యం కల్పిస్తామని, గల్ఫ్ కార్మికులకు సైతం వర్తింపజేస్తామని సీఎం వెల్లడించారు.
ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్లా వస్తుందని రైతులను అడిగారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లుగా మారుతుందని, కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఎదురయ్యే ఉప్పెన ఇదేనంటూ చెప్పారు. గ్రామాల్లో చర్చ పెట్టి ఏ పార్టీ మంచిదో ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ కిట్ గురించి ఎవరూ గతంలో ఎవరూ ఆలోచించలేదన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేయించుకుంటే ఉల్టా డబ్బులిస్తున్నామని, దీంతో పేదలకు ఎంతో బాధ తప్పిందన్నారు. సీఎంఆర్ఎఫ్ ఎంతో మందికి అందించామన్నారు. కంటి వెలుగును కలలో కూడా ఊహించారా? అన్నారు. ఇవన్నీ మానవీయ కోణంలో అమలైన పథకాలని చెప్పారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని కార్యరూపంలోకి వచ్చాయన్నారు. అద్భుతంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం వెనుకకు పోవాల్నా? అంటూ ప్రజలను అడిగారు. లంబాడా బిడ్డలు ఇక్కడ ఎక్కువ ఉంటారని, తండాల్లో స్వయం పాలన తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. రూరల్లో 50 తండాలు జీపీలుగా మారాయని, నిధులు నేరుగా అందిస్తున్నామని చెప్పారు. 3వేల ఎకరాల పోడు భూములను గిరిజనులకు పంచామని, మిగిలిన భూ సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోరికను ఎవ్వరూ తీర్చలేదని, ఎస్టీ రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుకున్నామన్నారు. దీంతో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. దీనిపై లంబాడా సోదరులు ఆలోచన చేయాలని కోరారు. త్వరలోనే మంచిప్ప రిజర్వాయర్ పూర్తవుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే నీటి తీరువాను రద్దు చేశామని కేసీఆర్ వెల్లడించారు. సమయానికి పెట్టుబడి సాయం, సాగుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని, రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అన్నారు. నష్టం వచ్చినా ధాన్యాన్ని సర్కారే కొంటున్నదని తెలిపారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే బాధిత కుటుంబానికి బీమా రూపంలో రూ.5లక్షలు అందిస్తున్నామన్నారు. ప్రజలు కట్టిన పన్నులను రైతుబంధు రూపంలో దుబారా చేస్తున్నామని, సాగుకు 3గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాజాప్తా, ఖుల్లా అంటున్నారని, పీసీసీ చీఫ్, మాజీ చీఫ్ రేవంత్, ఉత్తమ్ చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంటు ఉండాలంటే బీఆర్ఎస్కు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని కోరారు.
రైతుబంధు ద్వారా ప్రజా ధనాన్ని దుబారా చేస్తున్నారని మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్రెడ్డి చెబుతున్నారని, పీసీసీ అధ్యక్షుడేమో 24 గంటల కరెంట్ వేస్ట్ అని, 3 గంటలిస్తే సరిపోతదని అంటున్నారని కాంగ్రెస్ తీరును కేసీఆర్ ఎండగట్టారు. అంజుమాన్కు అప్పులైతే తలుపులను పీక్కొని పోయిన రోజులను చూడలేదా? అని గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్లే వచ్చి ఓట్లు అడుగుతున్నారని, దానికి మీరే సమాధానం చెప్పాలంటూ ప్రజలకు సూచించారు. దళితబంధు పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఈ పథకం గురించి ఎవరి మైండ్కూ రాలేదన్నారు. ఆదాయం పెరిగిన కొద్దీ పథకాలు పెంచుకున్నామని తెలిపారు. బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వమైనా ఫించన్లు ఇచ్చిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 16 రాష్ర్టాల్లో కార్మికులుంటే కేవలం తెలంగాణలోనే పింఛన్ ఇస్తున్నామన్నారు. వచ్చే ప్రభుత్వంలో కొత్త బీడీ కార్మికులు, టేకేదార్లకు కటాఫ్ డేట్ ఎత్తేసి పింఛన్ ఇస్తామన్నారు.
చేతిలో ఉన్నది జారగొట్టుకోవద్దని, నమ్మి మోసపోతే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఓటును ఆగమాగం వేయొద్దని హితవు పలికారు. బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల నాయకుడని సీఎం కేసీఆర్ కితాబిచ్చారు. ఆయన ఇల్లు నిత్యం ప్రజలతో కిటకిటలాడుతుందన్నారు. ఎంతమంది వచ్చినా వినతులు స్వీకరించి వారికి ఊరటను అందించే అనుభవం ఉన్న నాయకుడని, ప్రజా ఎమ్మెల్యేగా కీర్తించారు. బాజిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రూరల్ అభివృద్ధి కోసం బాజిరెడ్డి వినుతులను వచ్చే ప్రభుత్వంలో తప్పకుండా నెరవేరుస్తానని కేసీఆర్ మాటిచ్చారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, అంతా మంచే జరుగుతుందని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా రాజకీయ పరిణతి పెరగలేదని సీఎం కేసీఆర్ అన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, వారి వెనుకాల ఉన్న పార్టీల చరిత్ర, నడవడిక, అవకాశమిస్తే వారు ఏం చేస్తారు.. అన్నది ఆలోచించి ఓటెస్తే ప్రజలు గెలవడం ప్రారంభిస్తారని చెప్పారు. ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో అప్పడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. రాయేదో, రత్నమేదో గుర్తించాలని కోరారు. బీఆర్ఎస్ 24 ఏండ్ల క్రితం ప్రజల కండ్ల ముందే పుట్టిందని, అందరం కలిసి ఉద్యమించి రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 58 ఏండ్లు బాధలు అనుభవించామన్నారు. 1969 ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ 400 మందిని పిట్టల్లా కాల్చిందన్నారు. 2004లో పొత్తు పేరిట చేతులు కలిపిందని, వారికి ఫలితం వచ్చినప్పటికీ తెలంగాణ ఇయ్యకుండా ఢోకా చేసిందని, బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం జరిగిందన్నారు. తిక్క పుట్టి కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగితే తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి ఆగం చేశారని గుర్తుచేశారు. 33 పార్టీల సపోర్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2014లో అనివార్యంగా ప్రత్యేక తెలంగాణను ఇచ్చిందని చెప్పారు. పదేండ్లలో ఏం జరిగిందో? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ఆలోచన చేయాలని కోరారు.