పటాన్చెరు టౌన్, జూలై 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపడంలో భాగస్వాములు కావాలన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ర్టాలకు చెందిన ఓటర్లు, కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్పై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతాల అభివృద్ధిలో ఓటు హక్కు చాలా అవసరమన్నారు. ఓటు ఉంటేనే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. పటాన్చెరు భవిష్యత్కు ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ర్టాల ప్రజలు ఉపాధి కోసం ఇక్కడే నివసిస్తూ ఓటు హక్కు పొందారన్నారు. కులం, మతం ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని, అన్ని రాష్ర్టాల ప్రజలు పండుగలను కలిసిమెలిసి జరుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరును నిలుపుతున్నారన్నారు.
అనంతరం వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయికోటి రాజును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్యాదవ్, మెట్టు కుమార్యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, నాయకులు దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, నర్రా భిక్షపతి, పృథ్వీరాజ్, వివిధ రాష్ర్టాల ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు.