నిజామాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల ఆర్థికాభ్యున్నతి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కోరుతూ దళితులు కొన్నిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన వారందరికీ వెంటనే యూనిట్లు మంజూరుచేయాలని డి మాండ్ చేస్తూ ఇటీవల నిజామాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. తాజాగా కామారెడ్డి జిల్లాలో శనివారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో జిల్లాకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు, దళితబంధు పథకం లబ్ధిదారులు, ఆశావహులు వందలాది మంది తరలి వచ్చి ధర్నా చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా తీసుకు వచ్చిన దళితబంధును రాజకీయ కోణంలో చూడడం సబబు కాదని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. తొలి విడుతలో మంజూరైన యూనిట్లకు ఇవ్వాల్సిన నిధులను మంజూరుచేయడంతోపాటు రెండో విడుతలో ఎంపిక చేసిన వారందరికీ యూనిట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ఫ్రీజ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరికాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిలిచిపోయిన యూనిట్ల పంపిణీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండో విడుతలో భాగంగా యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా ప్రభుత్వం మారింది. దీంతో పథకానికి ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ నిలిచిపోవడంతో వారంతా ఆందోళనలు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందిస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండో విడుతలో ఏకంగా 1100 యూనిట్లు మంజూరు చేయగా.. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ఉమ్మడి జిల్లాలో 9900 యూనిట్లు మంజూరుకాగా.. వేలాది మంది దళిత కుటుంబాల్లో వెలుగులు పంచనున్న పథకాన్ని నిలిపేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
దళిత కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి
దళితబంధు పథకం దళితులు వ్యాపారవేత్తలుగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేసింది. లబ్ధిదారుడి వాటా లేకుండా అమలవుతున్న పథకంగా దళితబంధు చరిత్రకెక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున నిజామాబాద్లో 550, కామారెడ్డిలో 350 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన గ్రౌండింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ జోరుగా జరిగింది. వీరంతా తమ కాళ్లపై తాము నిలబడి దళితబంధు ద్వారా ప్రగతిని సాధిస్తున్నారు. మొన్నటి వరకు కూలీలుగా, ఆయా చోట్ల నెలవారీ జీతాలకు పనులు చేసిన వారే ఇప్పుడు యజమానులుగా పనులు చేసుకుంటున్నారు. రెండో విడుత పంపిణీపై కొత్త ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతోపాటు మొదటి విడుతలో మంజూరైన పలు యూనిట్లకు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఖాతాల్లో జమ చేసిన నిధులను సైతం ఫ్రీజ్ చేయడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దళితబంధును రద్దు చేయొద్దు
దళితబంధు పథకాన్ని రద్దు చేయొద్దు. ఈ పథకం ద్వారా దళిత సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అనేక పేద కుటుంబాలను ఆదుకునే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కొనసాగించాలని కోరుతున్నాం. కేసీఆర్ తెచ్చిన ఈ పథకం యావత్ దళిత జాతికి ఎంతో ఉపయుక్తమవుతుంది.
– లక్ష్మణ్, భిక్కనూరు
నిధులిచ్చి ఆదుకోవాలి…
దళితబంధు పథకాన్ని కచ్చితంగా అమలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలి. గతంలో ఇలాంటి పథకాలను ఏ ప్రభుత్వమూ తీసుకురాలేదు. కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు కొనసాగించాలని కోరుతున్నాం. ఇందులో రాజకీయాలను పక్కన పెట్టి నిధులు మంజూరుచేసి దళితులకు అండగా నిలవాలని విన్నవిస్తున్నాం.
– నారాయణ, కామారెడ్డి నియోజకవర్గం