మోర్తాడ్, జనవరి 1 : స్నేహితుడినే పొడిచి చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. భా ర్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో కత్తితో పొడిచి చంపాడు. ఎస్సై అనిల్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. చెప్పాల రాకేశ్ (26), తెడ్డుసూర్య మంచి స్నేహితులు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో చెప్పాల రాకేశ్ను.. సూర్య కత్తితో పొడిచి హత్య చేశాడు.
తెడ్డుసూర్య గల్ఫ్ వెళ్లి దసరా సమయంలో మోర్తాడ్కు వచ్చాడు. వివాహేతర సంబంధం విషయమై మూడు నెలల క్రితమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాకేశ్ హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఇంటికి వచ్చాడు. గొడవ జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న సూర్య రాకేశ్ను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాకేశ్ ఇంటి సమీపంలోని వాటర్ట్యాంకు వద్ద ఉండగా అదను చూసి కత్తితో పొడిచి చంపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్రెడ్డి తెలిపారు.
రాకేశ్ హత్యతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సూర్య ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. కోపంతో సూర్య ఇంటికి నిప్పంటించగా ఆర్పివేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సూర్యను తమకు అప్పగించాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని రాకేశ్ కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చున్నారు. భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అనిల్రెడ్డి చట్టపరంగా కఠినంగా శిక్ష పడేలా చూస్తామని, సూర్య తమ అదుపులోనే ఉన్నాడని ఆందోళన విరమించాలని సముదాయించడంతో ఆందోళన విరమించారు.