జక్రాన్పల్లి, సెప్టెంబర్ 28 : ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. గురువారం ఆయన మండలంలోని పడకల్ గ్రామంలో రూ.16.72 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో బాజిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడంలేదని ప్రశ్నించారు.
బీజేపీ నాయకుల తీరు అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట అన్న చందంగా మారిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి తెలంగాణ ప్రజలు, రూరల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్ష నాయకులు గ్రామాలకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారని, వాటిని నమ్మవద్దని సూచించారు.
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఐదేండ్లవుతున్నా ఇప్పటి వరకూ జాడలేదన్నారు. అబద్ధాల పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఆ పార్టీ నాయకులు అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వైద్యరంగానికి పెద్దపీట: బాజిరెడ్డి గోవర్ధన్
డిచ్పల్లి, సెప్టెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నదని, రూరల్ నియోజకవర్గంలో వైద్య సేవలను విస్తరింపజేస్తున్నామని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. డిచ్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రూ.కోటీ 50 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన డయాలసిస్ సెంటర్ను ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్తో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిచ్పల్లి సీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోరగా రూ. కోటీ 50 లక్షలు మంజూరు చేశారని తెలిపారు.
డయాలసిస్ రోగుల బాధ వర్ణనాతీతమని, వారికి మెరుగైన సేవలందించేందుకు డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా అందజేసే సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతం శ్రీనివాస్రెడ్డి, డీఎంహెచ్వో సుదర్శనం, డిప్యూటీ డీఎహెచ్వో అంజన, డీసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ శివశంకర్, డాక్టర్ రాజశ్రీ, సందీప్రెడ్డి, డాక్టర్ సుశాంత్, ఫార్మాసిస్ట్ రాధాకిషన్, హెడ్ నర్స్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.