Dharana Portal | రైతుల భూ సమస్యల పరిష్కారం, రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అవినీతిని అంతమొందించిందీ ‘ధరణి’ వెబ్పోర్టల్. చేతిరాతలతో రైతుల తలరాతలు మార్చిన ఉల్లంఘనులకు చెక్పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసింది. నాడు భూమి పట్టాల కోసం, భూ సమస్యల పరిష్కారానికి అయ్యా…సారూ అంటూ కాళ్లుపట్టుకున్న రైతన్నలు… నేడు సీఎం కేసీఆర్ తెచ్చిన ధరణితో దర్జాగా పని చేయించుకుంటున్నారు. పట్టుమని పదినిమిషాల్లో తహసీల్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకొని పట్టాతో కాలరెగరేసుకొని వెళ్తున్నారు. ‘ధరణి’ వెబ్పోర్టల్తో భూ సమస్యల నుంచి ప్రజలను శాశ్వతంగా విముక్తి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నది. విప్లవాత్మక వ్యవస్థను రూపొందించి పైసా ఖర్చు, పైరవీలు లేకుండా భూముల లావాదేవీలు సులువుగా, పారదర్శకంగా చేయడంపై రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
– నిజామాబాద్, మే 29
(నమస్తే తెలంగాణ ప్రతినిధి) నిజామాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో జరిగినంత అవినీతి, అక్రమాలు మరెక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి వ్యక్తికి సంబంధించిన భూ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలేది. అడ్డూ అదుపు లేకుండా జనాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీక్కుతినేది. ఈ తంతు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. సామాన్య ప్రజలను భూ సమస్యల పేరిట ఓ వైపు వీఆర్వోలు, మరోవైపు తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారంతో నకిలీ పట్టాలు ఇలా ఒకటేమిటి రకరకాల సమస్యలతో రోడ్డెక్కి తిప్పలు పడేది. పేరొందిన నాయకులు, కొంతమంది రెవెన్యూ అధికారులు కుమ్మక్కై వందల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను కూడా కాజేశారు.
నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి తతంగాలు వెలుగు చూసినవే. ఓ మాజీ మంత్రి వద్ద పనిచేసిన ఓ వ్యక్తి ఇందులో రూ.వందల కోట్లు సంపాదించి అతీతశక్తిగా మారి సామాన్యుల పాలిట భూ బకాసురుడిగా మారిన వైనం కూడా 2014కు మునుపు జిల్లా ప్రజల అనుభవాల్లో ఉన్నదే. ఈ దౌర్భగ్యకరమైన దుస్థితిని నిశితంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ ఎలాగైనా భూ సమస్యల నుంచి శాశ్వతంగా ప్రజలను విముక్తి చేయాలని ఆలోచించి ధరణి పోర్టల్ను తీసుకువచ్చారు. 2020, అక్టోబర్ 29వ తేదీన ప్రారంభమైన ఈ వెబ్పోర్టల్తో వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను తహసీల్కార్యాలయాల్లోనే నిర్వహించడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వేధింపులు, అవినీతికి పూర్తిగా చెక్ పడింది. పైసా అదనపు ఖర్చు లేకుండా వ్యవసాయ భూముల లావాదేవీలు సులువుగా జరుగుతున్నాయి.
దళారుల ఆగడాలకు అడ్డుకట్ట…
ధరణి పోర్టల్ వచ్చాక పైరవీ అనే పదం కనిపించడం లేదు. వినిపించడం లేదు. కిందిస్థాయిలో భూ బదలాయింపు ప్రక్రియ గతంలో ఆలస్యమయ్యేది. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదు. నిమిషాల్లోనే పనులు అయిపోతున్నాయి. గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు వెళ్లి చాలా సేపు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడా బాధలకు చెక్ చెబుతూ వ్యవస్థలో పెనుమార్పు కనిపిస్తున్నది. ధరణితో రైతుల వ్యవసాయ భూములకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తున్నది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి 10 నుంచి 15 నిమిషాల్లో పట్టా చేతికిచ్చి పంపుతున్నారు. రైతులకు సులభంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందించాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరుతున్నది.
ధరణిలో వేలిముద్రలు పడని వారికి ఐరిస్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకపోవడంతో రైతులు సంతోషంగా ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే సంబంధిత హక్కు పత్రాలు రైతులకు ఇచ్చేస్తుండడంతో పైరవీకార్ల చేతివాటం పూర్తిగా పోయింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమ రిజిస్ట్రేషన్లకు, అవినీతికి తావు లేకుండా ధరణి పోర్టల్లో జరుగుతున్న పనులను రైతులు స్వాగతిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,15,928 వన్బీ ఖాతాల్లో భూములుండగా 2,58,685 వ్యవసాయ ఖాతాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2,73,770 వన్బీ ఖాతాలుండగా 2,59,745 వ్యవసాయ ఖాతాలున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. రోజుకు సగటున ఒక్కో తహసీల్ కార్యాలయంలో కనిష్ఠంగా 5 నుంచి గరిష్ఠంగా 15 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
దూరం దగ్గరగా…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంతరాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్నది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం దాదాపుగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం మహారాష్ట్ర భూభాగంతో కలిసే ఉంటుంది. ధరణి సేవలతో సరిహద్దు ప్రాంత ప్రజలకు మరింతగా లాభం చేకూరింది. వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల్లో ఎక్కడికో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్, పిట్లం, బోధన్, కోటగిరి, రెంజల్ మండలాల్లోని రైతులు ఇబ్బందులు పడేవారు. ధరణితో స్థానిక తహసీల్ కార్యాలయాల్లోనే భూ బదలాయింపు జరుగుతుండడంతో జుక్కల్, బోధన్ నియోజకవర్గాల ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదంటూ కొనియాడుతున్నారు. నిజాంసాగర్, పిట్లం మండలాలకు చెందిన ప్రజలంతా గతంలో బాన్సువాడకు రాక తప్పేది కాదు. బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ ప్రాంత ప్రజలంతా బిచ్కుందలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేది. వీళ్లందరూ ప్రస్తుతం వా రి మండల కేంద్రాల్లోనే సులువుగా వ్యవసాయ భూముల క్ర య, విక్రయాలు సాగిస్తున్నారు.
దళారులు డబ్బులు తీసుకునేటోళ్లు..
సదాశివనగర్, మే 29: సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో మంచి పనిచేసింది. ధరణి పోర్టల్ లేకుంటే రిజిస్ట్రేషన్ కోసం దళారులు ఇష్టం వచ్చినట్లు డబ్బులు తీసుకునేటోళ్లు. ధరణి వచ్చిన తర్వాత పది నిమిషాల్లో పైసా ఖర్చు లేకుండా పట్టాపాస్ బుక్ ఇస్తున్నరు. ధరణి వచ్చి ఎంతో మేలు చేసింది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పనులు జరుగుతుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదనుకుంట. రైతులు బాధ పడితే మీకు ఏమొస్తుంది. మీ అసొంటి వాళ్లను ఇంక గెలిపిస్తమా? నిత్యం రైతు క్షేమాన్ని తలిచే కేసీఆర్ సారే మాకు.. మా భూములకు రక్ష.
– చాకలి రాజయ్య, రైతు, తిమ్మోజివాడి
పది నిమిషాల్లో పాస్ పుస్తకం ఇస్తుండ్రు..
సదాశివనగర్, మే 29: గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కన్నా ధరణి వచ్చిన తర్వాతే పని మంచిగున్నది. రిజిస్ట్రేషన్ల కోసం దళారులకు పైసా ఇచ్చుడు లేదు. అమ్మినోళ్ల నుంచి కొన్నొళ్ల పేరు మీదికి నిమిషాల్లో భూమి మారుతున్నది. గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏండ్ల తరబడి ఎమ్మార్వో చుట్టూ చెప్పులరిగేలా తిరిగేటోళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. బాధలన్నీ పోయినయి అనుకుంటే కాంగ్రెసోళ్లు వచ్చినంక మళ్లీ రాత పద్ధతి, పూత పద్ధతి తెస్తామంటే ఊరుకోం. ప్రశాంతంగా ఉన్న రైతుల మధ్య లొల్లిపెట్టొద్దు. మంచి వ్యవస్థను స్వాగతించాలి.
-అమృత రాజేందర్ రావు,
స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త, లింగంపల్లి తిరుగుడు తప్పింది..
మద్నూర్, మే 29: గతంలో రిజిస్ట్రేషన్ కోసం బిచ్కుంద సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లేవాళ్లం. అక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ను తీసుకువచ్చి వీఆర్వోకు ఇచ్చేవాళ్లం. వాళ్లు నాలుగైదుసార్లు తిప్పుకొని పహాణిలో నమోదు చేసి పాస్బుక్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుండే. ధరణి వచ్చిన తర్వాత తహసీల్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. నిమిషాల్లోనే మా పేరు మీద భూమి ఆన్లైన్లో నమోదవుతుంది. పోస్టాఫీసు ద్వారా పాస్బుక్ ఇంటికి వస్తున్నది. ఎవ్వరికీ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో సామాన్య ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇంత మంచి వ్యవస్థను రద్దు చేస్తామని కాంగ్రెసోళ్లు అనడం కరెక్టు కాదు. పాత పద్ధతిల రాత లెక్కలు తీసుకొస్తే రైతుల మధ్య గొడవలు అవుతాయి. పైసా, పలుకుబడి ఉన్న వాళ్లు చెప్పినట్లే పనులు అవుతాయి. ఒకరి భూమి ఒకరికి మారుతుంది. ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎవుసం చేసుకుంటున్న రైతుల మధ్య పంచాయితీ పెట్టాలని చూడొద్దు. కాంగ్రెసోళ్లకు రైతులు బాగుండడం నచ్చడం లేదేమో..
– నాగేశ్, మద్నూర్
రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుండే..
మోర్తాడ్, మే 29: గతంలో భూమి మార్పిడి చేయించుకోవాలన్నా, కొన్న భూమిని పాస్బుక్లోకి ఎక్కించుకోవాలన్నా రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుండే. ఇప్పుడు తహసీల్ కార్యాలయంలోనే ధరణి పోర్టల్ ద్వారా నిమిషాల్లోనే పని పూర్తవుతున్నది. నాకు సంబంధించిన ఎనిమిదిన్నర ఇసాల భూమి నర్సుబాయి పేరు మీద వచ్చింది. ఆభూమి తిరిగి నాపేరు మీద పాస్బుక్లోకి వచ్చేందుకు శుక్రవారం స్లాట్బుక్ చేసుకున్న శనివారం నిమిషాల్లో పనిపూర్తయ్యింది. ఇదే గతంలోఅయితే రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తుండే. పోయిన ప్రతిసారి కారు మాట్లాడుకొని వెళ్లడం తిరిగిరావడం, డాక్యుమెంటేషన్కు నాలుగైదు రోజులు ఆగాల్సి రావడం, రిజిస్ట్రేషన్ అయ్యాక, తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఖర్చు కూడా బాగానే అయ్యేది. ఇప్పుడు మాత్రం మీసేవలో స్లాట్బుక్ చేసుకొని తీసుకున్న సమయం ప్రకారం తహసీల్ కార్యాలయానికి వెళ్లడం, నిమిషాల్లో పనిపూర్తి చేసుకుంటున్నాం. ఎక్కడా ఖర్చుతో కూడుకున్న పనిలేదు. ధరణి పోర్టల్ రావడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం సులభం కాగా, మన భూమి ఏ సర్వేనంబర్లో ఎంత ఉందో తహసీల్ కార్యాలయానికి వెళ్లకుండా, ఏ అధికారినీ అడగకుండానే చూసుకునే అవకాశం ఏర్పడింది. భూములకు సంబంధించి ధీమాగా ఉండే పరిస్థితులు ధరణి వెబ్ పోర్టల్ ద్వారా ఏర్పడింది.
-శివకుమార్, ధర్మోరా
ధరణి పద్ధతే బాగున్నది..
ధర్పల్లి, మే 29: గతంతో పోలిస్తే ఇప్పుడు నడుస్తున్న ధరణి పద్ధతి చాలా బాగున్నది. భూమికి సంబంధించిన సమస్యలన్నీ సులువుగా అయిపోతున్నాయి. భూములు కొన్నా.. అమ్మినా మండలంలోనే పని పూర్తవుతోంది. ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది. ధరణి వచ్చుట్ల రికార్డులన్నీ కంప్యూటర్లో ఉంటున్నయి. ఎవరు కూడా ఇష్టం వచ్చినట్లు మార్చకుండా చేసిండ్రు. ఇంత మంచి వ్యవస్థ ఉన్న తర్వాత భూమి రికార్డులు ఎక్కడికి పోతాయి. గీ సిస్టంను మార్చవద్దని గవర్నమెంటును కోరుకుంటున్న.
-అమ్ముల అనసూయ, మహిళా రైతు, కేశారం
సెల్ఫోన్లనే రికార్డులు చూస్తున్నాం..
ధర్పల్లి, మే 29: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూమి రికార్డులను సెల్ఫోన్లోనే చూసుకుంటున్నాం. సర్వే నెంబర్ కొడితే అన్ని వివరాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భూమి రికార్డులు చూడాలంటే వీఆర్వోల వద్దకు వెళ్లి కాళ్లావేళ్లా పడి బతిమిలాడాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. కొత్త టెక్నాలజీని ప్రభుత్వం తీసుకురావడంతో సౌకర్యవంతంగా మారింది. పేపర్లో చదివిన. కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్ను తీసేస్తాం అనడం చదివి చాలా బాధేసింది. మంచి వ్యవస్థను తీసేస్తమంటే రైతులే కాంగ్రెస్ను తీసేసే పరిస్థితులు వస్తాయి.
-గూగ్లోత్ బాలు, రైతు ఇందిరానగర్ తండా గీడనే రిజిస్ట్రేషన్ కావడం
చానా సంతోషం..
ధర్పల్లి, మే 29: భూముల రిజిస్ట్రేషన్ మండలంలనే అవడం చానా సంతోషమనిపిస్తుంది. పాత కాలం కన్నా ఇప్పుడే మంచి సౌలత్లు వచ్చినయ్. అప్పుడైతే సార్ల కాళ్లు మొక్కాల్సి వస్తుండే. ఇప్పుడు మంచిగ కూర్చుండబెట్టి పని చేసిస్తుండ్రు. ఇదంతా కేసీఆర్ సారు చేపిస్తున్నడట మా కొడుకు చెప్పిండు. మంచిగ అనిపిస్తుంది. ఇప్పుడైతే బాధలు తప్పినయి. భూముల పని అల్కాగనే అయిపోతున్నది.
-బదావత్ గుజ్రీ, మహిళా రైతు, మరియ తండా