హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య పెరుగడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సంఘాల కార్యకలాపాల్లో సంస్కరణలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఫోరం అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాజ్యాంగంలోని 171వ అధికరణం ప్రకారం ఉపాధ్యాయులకు ఇప్పటికే శాసనమండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలకు బోధనా బాధ్యతలు, హాజరు మినహాయింపులు ఇవ్వడంతో బోధనకు అంతరాయం కలుగుతుందని, సంఘాల సంఖ్య పెరిగే కొద్దీ బోధకుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై నిర్దేశిత పాఠ్యాంశాన్ని బోధించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఈ నిబంధనలు అమలుకావడం లేదని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీసీపీ గెట్) ఫలితాల్లో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. కామర్స్ విభాగంలో తోట రాహుల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో శ్రావణి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, బోటనీ విభాగంలో వినీల్, ఫిజిక్స్ విభాగంలో ప్రశాంత్ రెండోర్యాంక్, జువాలజీలో అనూష మూడో ర్యాంక్ సాధించారు.
మొత్తంగా 17 పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగాల్లో 32 మంది విద్యార్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. ఇటీవల వెలువడిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలోనూ గురుకుల విద్యార్థులు 28మంది సీట్లు పొందారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిషనర్ బాల మాయాదేవి, సొసైటీ కార్యదర్శి సైదులు అభినందించారు.