నిజామాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);‘సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రోజురోజుకూ బీఆర్ఎస్ కుటుంబంలో చేరుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. కార్యకర్తలతో మమేకం కావడానికి.. వారి సాధకబాధకాలు తెలుసుకోవడానికి ఆత్మీయ సమ్మేళనాలు చక్కని వేదికగా నిలుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 70 వరకు సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జిల్లా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తున్నదని’ శాసనమండలి డిప్యూటీ చైర్మన్, జిల్లా కో-ఆర్డినేటర్ బండ ప్రకాశ్ తెలిపారు. సమ్మేళనాలకు విశేషమైన స్పందన రావడంతో తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కార్యకర్తలతో మమేకమయ్యేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు సమ్మేళనాల కో-ఆర్డినేటర్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జోరుగా అమలవుతున్నాయని, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, నీరజా రెడ్డి దంపతులు స్వయంగా వేడుకల్లో పాల్గొనడం స్ఫూర్తివంతంగా ఉందన్నారు. ఒకప్పుడు కరువు, కాటకాల మూలంగా వలసలతో అల్లాడిన తెలంగాణ ప్రాంతంలో సీఎం కేసీఆర్ కృషితో నేడు రివర్స్ మైగ్రేషన్ (వలసలు వాపస్) కనిపిస్తున్నదని అన్నారు. ఆయన పాలనతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని చెప్పారు. కులవృత్తులకు జీవం పోయడం ద్వారా ఆర్థిక సంపత్తి ఉన్నత స్థాయికి చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరుగలేదన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ సమన్వయకర్తగా పని చేయడం గొప్ప అనుభూతిని ఇస్తున్నదని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా అశేష బీఆర్ఎస్ పార్టీ కుటుంబీకులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 దాకా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో బండ ప్రశాశ్ తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్న వివరాలు ఆయన మాటల్లోనే..
రివర్స్ మైగ్రేషన్..
ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లాలో చాలా మంది గతంలో గల్ఫ్ బాట పట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కొద్ది మంది మాత్రమే అటువైపు వెళ్తున్నారు. చాలావరకు వలసలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న సానుకూల విధానాలే ఇందుకు ప్రధాన కారణం. నేను మహబూబ్నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జిగానూ పని చేశాను. వలసలంటేనే పాలమూరు బిడ్డలు గుర్తుకు వచ్చేది. అక్కడ కూడా వలసలు బందయ్యాయి. పైగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల నుంచి కార్మికులు బతికేందుకు మన ప్రాంతానికి వస్తున్నారంటే తెలంగాణ ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. పైగా నిజామాబాద్ లాంటి ప్రాంతంలో గల్ఫ్ జీవితాలను ముగించుకుని వ్యవసాయం చేసుకునేందుకు తిరిగిరావడం రివర్స్ మైగ్రేషన్ కాక మరేమిటి? ఇంతటి ఘనమైన మార్పు.. తెలంగాణ సిద్ధించిన తర్వాతనే సాధ్యమైందన్న వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోవడం బీఆర్ఎస్ శ్రేణుల ముఖ్య కర్తవ్యం.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్..
కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నది. సీఎం కేసీఆర్ భారత ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తే అన్నదాత సమస్యలు అనతికాలంలోనే పరిష్కారం అవుతాయనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా రైతులు ఆర్థికంగా ఎదగడానికి అనేక చర్యలు చేపట్టాలి. వారి జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచాలి. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. కేసీఆర్కు దేశ రైతాంగం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎన్నుకున్న బీజేపీ నేతలు దేశ పాలనను పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టారు. అధికారాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట పడాలంటే ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి దేశంలో అధికారంలోకి రావడం అవసరం. అందుకే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం దేశం నలుమూలలకూ విస్తరించడం ఖాయం.
బీఆర్ఎస్కు కంచుకోట ఇందూర్
నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు 60 లక్షలకు పైగా కార్యకర్తల బలం ఉన్నది. ఇంతటి కీర్తిని సంపాదించుకున్న గులాబీ పార్టీ సైన్యంతో ముఖాముఖి, తద్వారా కార్యకర్తల సాధక బాధకాలను తెలుసుకోవడం, మంచిచెడులో భాగం కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పార్టీ ప్రగతిలో అన్నింటా ముందుండే కార్యకర్త సంక్షేమ బాధ్యత నాయకులదే. ఆత్మీయ సమ్మేళనం ద్వారా వారిని కలుపుకొని పోవడం, చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నచోట వాటికి ముగింపు పలికి పార్టీ ఉన్నతి కోసం పనిచేయడానికి చక్కటి వాతావరణాన్ని కల్పిస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచీ నిజామాబాద్ జిల్లా ప్రజలంతా కేసీఆర్ వెంటే నడిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎనలేని విజయాన్ని అందించి ఉద్యమానికి ఊపిరి పోశారు. నాటి నుంచి నేటి వరకు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పార్టీకి ఢోకా లేదు. వచ్చే ఎన్నికల్లోనూ అంతకు మించిన విజయాలు తథ్యమన్న భావన కలుగుతున్నది.
ఆత్మీయత.. అనురాగాలు
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అడుగడుగునా ఆత్మీయత, అనురాగాలు ప్రతిఫలిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డి తన అర్ధాంగి నీరజారెడ్డితో కలిసి ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఉదయమే కార్యక్రమాన్ని ప్రారంభించి కార్యకర్తల బాగోగులు తెలుసుకుంటూ, ఫొటోలు దిగుతూ వారితో మమేకమవుతున్నారు. ఈ ప్రయత్నం చాలా బాగుంది. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపుతున్నారు. కుటుంబంలో ఒక ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే బాల్కొండలో కనిపిస్తున్నది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో కార్యక్రమాలకు శ్రేణులు భారీగా హాజరవుతున్నారు. వారిని పేరుపేరునా పలుకరిస్తూ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేసి ఉత్సాహం నింపుతున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు కొండంత అండగా ఉన్నామన్న సందేశాన్నిస్తున్నారు.