నిజామాబాద్ జిల్లాలో యాసంగి పంటలు వేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 2023-24 సంవత్సరానికి గాను 5,07,539 ఎకరాల్లో రైతులు పంట సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. కాగా ఈ ఏడాది ఇతర పంటల సాగుపైనా రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు ముందస్తుగానే పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరినాట్లు షురూ అయ్యాయి.
ఖలీల్వాడి, డిసెంబర్ 13 : యాసంగి సీజన్లో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. జలవనరులు పుష్కలంగా ఉండడంతో అంచనాలకు మించి పంటలు సాగవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2023-24 సంవత్సరానికి 5,07,539 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. 2022 యాసంగిలో 4,08,444 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా 5,07,532 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ యాసంగిలో వరితో పాటు రైతులు ఇతర పంటల సాగుపైనా దృష్టి సారించారు. అవసరం మేరకు ఎరువులు, విత్తనాలను సైతం వ్యవసాయశాఖ సిద్ధంగా ఉంచింది. యాసంగి సీజన్ అంటేనే గతమంతా కన్నీళ్ల పర్యంతం, సమయానికి కరెంట్ రాక, అందుబాటులో విత్తనాలు, ఎరువులు లేక అన్నదాతలు పడిన గోస అంతా ఇంతా కాదు. అప్పో సొప్పో చేసి సాగుకు ముందడుగు వేస్తే సరిపడా నీళ్లు అందేవి కాదు. భూగర్భజలాలు ఇంకి బోర్లలో నీరు వచ్చేది కాదు. సాగు కాలువల్లో చుక్కనీరు కనిపించక రైతుల్లో భయాందోళనలే వెంటాడేవి. మరోవైపు సాగుకు కరెంట్ కటకట తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసేది. రాత్రి పూట పొలాల వెంట పరుగులు తీసి పాముకాటుకు, విద్యుత్ తీగల బారిన పడి మృత్యువాత పడిన వారు ఎంతోమంది. యాసంగి సీజన్ ముగిసిన తర్వాత చేతికి పెట్టుబడి పైసలు కూడా రాకపోగా అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకునేది. ఇలాంటి దుస్థితి నుంచి సుభిక్షమైన వ్యవసాయంలోకి రైతులు అడుగు పెట్టారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో సాఫీగా సాగింది. ఎలాంటి ఆటంకాలు, ఆత్మహత్యలు, పాముకాటు లేకుండా రైతులు పంటలు పండించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువులు ఎండిపోకుండా నీరు ఉండడంతో పంటలు బాగా పండుతున్నాయి. కానీ 2023-24లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. 24 గంటల కరెంట్ ఇస్తారా లేదా అనే విషయంలో రైతులు తర్జనభర్జన అవుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 29 మండలాల్లో రెండు అర్బన్ మండలాలను మినహాయిస్తే మిగిలిన 27 మండలాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు సాగుకు నోచుకుంటున్నాయి. ఈ లెక్కల ప్రకారం యా సంగి 2023-24 లో వ్యవసాయ శాఖ అంచనాలు భారీగా నమోదు చేసింది.5,07,539 ఎకరాల్లో పంటలు వేస్తారని నివేదికలను రూపొందించారు.
అంచనాలకు అనుగుణంగా అధికారులు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. వరి 99,954 క్వింటాళ్లు, మక్కజొన్న 1897, శనగ 5643, మినుము 15, సజ్జలు 343, నువ్వులు 287, సన్ఫ్లవర్ 112 , కుసుమ 14, జొన్నలు 684 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు.