ఇందల్వాయి, డిసెంబర్ 2 : మూడు సీజన్ల నుంచి వరి రైతులు వరుసగా నష్టాల పాలవుతున్నారు. ఏటా దిగుబడి తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగులో సాంకేతికత లేకపోవడం, సాగుపై రైతుల్లో అవగాహన లోపం, చీడపీడల ఉధృతి దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలుగా వ్యవసాయ అధికారులు విశ్లేషిస్తున్నారు. నాణ్యమైన దొడ్డురకం వరి వంగడాల సాగుతో ఎకరాకు గరిష్టంగా 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ గత యాసంగి పంట నుంచి వరుసగా మూడు సీజన్లలో గరిష్టంగా 28, కనిష్టంగా 22 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. ఆరుతడి పంటలే మేలని, రైతులు ఆ దిశగా దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
వరి పంటను కొంతకాలంగా మెడ విరుపు, మొగి పురుగు వంటి చీడపీడలు ఆశించడంతో దిగుబడి తగ్గిపోయింది. గత సీజన్లో వర్షాలతో పంట దెబ్బతిని కర్షకులు కష్టాల పాలయ్యారు. ప్రస్తుత సీజన్లో సైతం దిగుబడులు తగ్గాయని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు వరి పండించడానికి రైతులకు రూ. 30 వేల పైనే పెట్టుబడి అవుతుంది. దీనికి రైతు శ్రమ అదనం. ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా పెట్టుబడులు పోగా రైతుకు మిగిలేది సుమారు రూ.18 వేలు మాత్రమే.
ఆరుతడి పంటల వలన ఖర్చు తగ్గడంతోపాటు ఆదాయం కూడా రెండింతలు పెరిగే అవకాశముందని అధికారులు, శాస్త్రవేతలు సూచిస్తున్నారు. వరి ఎకరాకు అయ్యే నీటిని రెండు నుంచి మూడెకరాల ఆరుతడి పంటల సాగుకు వినియోగించవచ్చని పేర్కొంటున్నారు. చలికాలంలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఆరుతడి పంటలైన మినుములు, పెసర్లు, వేరుశనగ, కందులు, ఆముదం తదితర పంటలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఆరుతడి పంటల ద్వారా చీడపీడల సమస్యలు ఉండవని, తక్కువ కాలంలో పంటలు చేతికి వస్తాయని తెలిపారు.
పంట మార్పిడి ద్వారానే అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రతిసారి వరి పంటను సాగుచేయడం ద్వారా అధికంగా నీటి వినియోగంతోపాటు రసాయనిక ఎరువులు విరివిగా వాడడంతో భూమిపై దుష్ప్రచారం చూపిస్తుందని పేర్కొంటున్నారు. వాస్తవానికి సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు సమపాళ్లలో వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.
ఏండ్ల తరబడి పంట మార్పిడి చేయకపోవడంతో భూమి నిస్సారంగా మారి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. రైతులు ఇకనైనా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించాలి. దీంతో భూసారం పెరిగి దిగుబడులు పెరగడమే కాకుండా నీరు, రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది.