Robbery | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో పట్టపగలే ప్రధాన రహదారిలో నిలిపించిన కారు అద్దాలు పగలగొట్టి నగదు చోరీ జరిగిన సంఘటన బోధన్ పట్టణంలో సంచలనమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోధన్ మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. కాగా ఆ డబ్బులను తన బ్యాంకు ఖాతాలను విత్ డ్రా చేసేందుకు బోధన్ కు వచ్చాడు.
ఈ క్రమంలో రుద్రూర్ వెళ్లే రహదారి పక్కన ఉన్న కెనరా బ్యాంక్ నుంచి రూ.3 లక్షలు విత్ డ్రా చేసుకొని వాటిని ఓ కవర్లో పెట్టి కార్లో గోశాల రోడ్ లోని ఇండియన్ బ్యాంకు వద్దకు వచ్చాడు. కారు బ్యాంకు సమీపంలో రోడ్డు పక్కగా నిలిపి సదరు బ్యాంకు నుంచి మరికొన్ని డబ్బులు తీసుకుని వచ్చేలోపు, తన కారు అద్దాలు పగలగొట్టి ఉండడం గుర్తించి డబ్బుతో ఉన్న కవర్ పరిశీలించాడు. అది కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సదరు వ్యక్తి బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం గుర్తించిన వ్యక్తులే వెన్నంటి వచ్చి ఈ చోరీకి పాల్పడి ఉంటారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. బోధన్ పట్టణంలో పట్టపగలే దుండగులు చోరీ జరపడం చర్చనీయాంశంగా మారింది.