కుంభవృష్టి రైతులకు క‘న్నీళ్లే’ మిగిల్చింది. భారీ వరద దండిగా నష్టం చేకూర్చింది. చెరువులు, కుంటలు నిండాయని సంతోషపడాలో, వేసిన పంట కొట్టుకుపోయిందని ఏడవాలో తెలియని సందిగ్ధావస్థలతో రైతు కుమిలిపోతున్నాడు. ఇసుక దిబ్బలుగా మారిన పంటపొలాలను చూసి ఆవేదనకు గురవుతున్నాడు. భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలో 23 వేల మందికి రైతులకు పుట్టెడు దుఃఖమే మిగిలింది. దాదాపు 33 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయశాఖ నష్టం వివరాలను తేల్చే పనిలో నిమగ్నమైంది.
– నిజామాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానాకాలంలో అతి భారీ వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. నిజామాబాద్ జిల్లా అన్నదాతలను తీవ్రంగా కుంగదీసింది. కురిసిన కుండపోత వానలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఏకధాటి వానలకు తోడుగా గాలి దుమారం తీవ్రంగా చేటు చేసింది. దీంతో ఆరుగాలం సాగులో అన్నదాతకు ఆదిలోనే ఆటంకం ఎదురైనట్లుగా మారింది. ఊహించని విధంగా వానాకాలం సీజన్లో విపత్తు మాదిరిగానే వానలు కురిసి రైతులకు కన్నీరు తెప్పించింది. వరి పంట నాట్లు వేసిన వారందరిపై దెబ్బ మీద దెబ్బ తగిలినైట్లెంది. దెబ్బతిన్న పంటలను చూసి కర్షకులు కంటతడి పెడుతున్నారు. ఎదురయ్యే నష్టాలను తలచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధుల ఎదుట ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పంట నష్టం వాటిల్లిన తర్వాత అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు రావడం, పంట నష్టాన్ని అంచనా వేయడం, నివేదిక సమర్పించడం వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని రైతులను కుంగదీసింది.
నిజామాబాద్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో వానలు కాసింత తెరపినివ్వడంతో రైతులకు ఊరట దక్కింది. అంతకుముందు వారం రోజుల పాటు కురిసిన వానలతో మొత్తం 24వేల 35 మంది రైతులకు చెందిన 33వేల 429 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. జూలై 26, 27వ తేదీల్లో 26వేల 866 ఎకరాలు, 25వ తేదీన 400 ఎకరాలు, 24న 6138 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 14వేల మంది రైతులకు సంబంధించిన 21,697 ఎకరాల్లో వరి పంట నష్టం వెలుగు చూసింది. 3500 మంది రైతులకు చెందిన సోయాబీన్ పంట ఏకంగా 5279ఎకరాలు, మక్కజొన్న 4470 మంది రైతుల పొలాల్లో 5వేల ఎకరాలు, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో 1108 మంది రైతులు సాగు చేసిన పసుపు పంట దాదాపు1447 ఎకరాల్లో నష్టం చవిచూసింది. ఆర్మూర్ డివిజన్లో 8246 ఎకరాలు, భీంగల్ డివిజన్లో 19031 , నిజామాబాద్ రూరల్ డివిజన్లో 1770, బోధన్ డివిజన్లో 2700, బాన్సువాడ డివిజన్లో 1682 ఎకరాల్లో వాన బీభత్సం సృష్టించింది.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందిస్తున్నది. వారి ఇబ్బందులను తొలగించి నష్టాలను నివారిస్తున్నది. వారం, పది రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన కుండపోత వానలతో నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. భారీ వానలతో పంటలన్ని ఎక్కడికక్కడ నష్టం వాటిల్లింది. వరి, సోయా, పత్తి, పసుపు, మక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల, భీంగల్, బాల్కొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఆర్మూర్, ఆలూర్, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, ధర్పల్లి, సిరికొండ, డిచ్పల్లి మండలాల్లో పంటల నష్టం వాటిల్లింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ వెంటనే కదిలి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసింది. పంట నష్ట వివరాలను ఎప్పటికప్పుడు సేకరించింది. వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా సమాచారాన్ని గ్రహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించింది. సీఎం ఆదేశాలతో నష్ట వివరాల సేకరణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై రైతులకు బాసటగా నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి , ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పంటలకు వాటిల్లిన నష్టంపై అప్రమత్తం చేశారు.
భారీ వానలతో రైతులకు అపార నష్టం వాటిల్లగా బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులంతా వరదల్లో తిరుగుతూ రైతులకు ధైర్యం చెప్పారు. బీజేపీ శ్రేణులు మాత్రం ఫక్తు రాజకీయం చేస్తూ పబ్బం గడిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పత్తా లేకుండా ఢిల్లీలోనే మకాం వేసి తప్పించుకుని తిరుగుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. జిల్లా అన్నదాతలంతా ఇబ్బందుల్లో ఉంటే రాజకీయ ప్రకటనలతో బీజేపీ ఎంపీ టైం పాస్ చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. రైతు ప్రభుత్వంగా పేరుగాంచిన కేసీఆర్ సర్కారు మరోసారి కర్షకులపై తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నైట్లెంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదేండ్లలో అన్నదాతలకు కొండంత అండ లభించింది. పంట నష్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కిస్తూ పరిహారం అందివ్వడంలోనూ వేగంగా చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వాతావరణ ఆధారిత బీమా, ఫసల్ బీమా యోజన పథకాల్లో నిబంధనల కిరికిరి పెట్టి రైతులతో ఆటాడుకుంటున్నది. బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు ఈ బీమా పథకాల ద్వారా లబ్ధ్ది చేకూరడం కలగానే మిగులుతున్నది. అంతేకాకుండా ప్రయోజనం అంతగా లేకపోవడంతో కేంద్రం అందిస్తున్న బీమాను రైతులు తిరస్కరిస్తున్నారు. ప్రీమియం చెల్లించినప్పటికీ కూడా పంట నష్టం తర్వాత పరిహారం సకాలంలో రావడం లేదనే రైతులు బీమా చెల్లింపులపై ఆసక్తి చూపడంలేదు.
పది రోజుల క్రితమే మొగులు మీద ఆశతో నేను నాట్లేసిన. మొగులు మొత్తం నా పొలంపైనే పడ్డట్టుగా పంటకు తీవ్రంగా నష్టం జేసిం ది. ఏం అర్థమైతలేదు. ఇసుకతో పొలమంతా నిండుకున్నది. పిలకలన్నీ కూరుకుపోయా యి. వరదలో కొట్టుకుపోయాయి. గింత వాన నేనెప్పుడూ సూడలే. నేను వేసిన మూడున్నర ఎకరాల భూమి అంతా ఇసుకతోనే నిండిపోయింది.
– గడ్డం సంపత్, చీమన్పల్లి, సిరికొండ మండలం
వానాకాలం షురూ అయినంక వర్షాలు లేవు. వానలు పడుతలేవని ఆలస్యంగా పుటం వేసుకున్నం. ఇంతలోనే వర్షాలు పడుతాయని చెప్పగనే నాట్లకు మోపైనం. 15వేలు రూపాయలు పెట్టి నాట్లేసిన. రెండు రోజులకే వానలు ఘోరంగా పడ్డాయి. నాట్లేసిన పొలమంతా కొట్టుకుపోయింది. నాట్ల పైసలన్నీ వరదలో కలిసినట్లయ్యింది. 12 ఎకరాల్లో వరి నాట్లేస్తే మొత్తం ఇసుకనే నిండింది.
-పెద్ద రాములు, కొండూర్, సిరికొండ మండలం
వానాకాలం సీజన్లో వానలు సమృద్ధిగా కురవడం పరిపాటే. కాకపోతే అతి భారీ స్థాయిలో ఏకధాటిగా కురవడం రైతులను కోలుకోకుండా చేస్తున్నది. ఆలస్యంగా మొదలైన వరి నాట్లపై అతి భారీ వానలు తీవ్రంగా దెబ్బతీశాయి. పిలక దశలో ఉన్న పంట పొలాలను వరద ప్రవాహం దెబ్బతీసింది. ఇసుక మేటలతో పొలాలు కనిపిస్తుండడంతో రైతులకు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పంట నష్ట నివారణ చర్యల కోసం ఏఈవోలను అప్రమత్తం చేశాం. వరద ముప్పు కాస్త తగ్గడంతో రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్నాం.
– మహ్మద్ వాజిద్ హుస్సేన్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి