గింజకడుతున్న వరిపైరు కండ్ల ముందే ఎండిపోతున్నది. బోరుబావి నుంచి చుక్క నీరు రావడం లేదు. నిజాంసాగర్ కాలువ ద్వారానైనా చివరి తడి అందించి పంటను కాపాడుకుందామంటే చివరి ఆయకట్టు వరకు బొట్టు నీరు రావడం లేదు. ఎండుతున్న పైరును చూస్తున్న రైతన్న కంట కన్నీరే వస్తున్నది. ఇదీ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల శివారులోని పలువురు రైతుల పరిస్థితి.
కోటగిరి, మార్చి 4: జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు నీటిపై ఆధారపడిన పంటలకు నీరు అందడం లేదు. కొందరు రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు ఇతర రైతుల బోరు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి కోటగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో సైతం బోరుబావులపైన ఆధారపడి సాగు చేసిన పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోటగిరికి చెందిన రాంబాబు అనే రైతు జైనాపూర్ శివారులో బోరుబావిపై ఆధారపడి ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల ఉన్నఫళంగా భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు నీళ్లు తగ్గిపోయాయి. ఆరు ఎకరాలకు నీరు లేక పంట ఎండిపోతున్నది. భూమి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇదే శివారులో పత్తి సాయిలు అనే రైతు 14ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు. బోరు నీరు సరిపోక, చివరి ఆయకట్టుకు నిజాంసాగర్ కాలువ నీరు అందక పంట ఎండిపోయే దశలో ఉన్నదని ఆందోళన చెందుతున్నాడు.
ఎంతో కష్టపడి వరి సాగు చేసిన. నిజాంసాగర్ కాలువ నీరు పంటకు అందకపోవడంతో కండ్లమందే పంట ఎండిపోతుంది. నీరు లేక భూమి పర్రెలు చాచింది. ఉన్న ఒక బోరు నుంచి సరిగా నీరు రావడం లేదు. నల్లా వచ్చినట్లు వస్తున్నది. పంటలకు బోరు నీరు సరిపోకపోవడంతో వరిపైరు ఎండిపోయే దశలో ఉన్నది. ప్రస్తుతం గింజకట్టే దశలో ఉన్నది. ఇదే సమయంలో నీరు లేకపోవడంతో పంట నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. అధికారులు స్పందించి కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగర్ నీరు అందించేలా చర్యలు తీసుకొని పంటలను కాపాడాలి.
– రాంబాబు, రైతు, జైనాపూర్ శివారు, కోటగిరి
ప్రస్తుతం వరి పంట గింజ కట్టే దశలో ఉన్నది. మరో తడి అందితే పంట కోతకు వస్తున్నది. కానీ చివరి ఆయకట్టుకు సాగు నీరు అందక పంట ఎండిపోతున్నది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు నీరు సరిపోవడం లేదు. రెండు రోజుల్లో నిజాంసాగర్ నీటిని అందిస్తే పంటలను కాపాడుకోవచ్చు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి నీటిని అందించి పంటలను కాపాడేలా చర్యలు తీసుకోవాలి.
-పత్తి సాయిలు, రైతు, జైనాపూర్ శివారు, కోటగిరి
నిజాంసాగర్, మార్చి 4: నిజాంసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు కోసం కొనసాగిన నీటి విడుదలను ఆదివారం రాత్రి నిలిపివేసినట్లు నీటి పారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 25వేల ఎకరాల పంటల కోసం నవంబర్ నెలలో ప్రారంభించిన నీటి విడుదల ఇప్పటి వరకు ఐదు విడుతల్లో పూర్తయ్యిందని అన్నారు. ఐదు విడుతల్లో 7.60 టీఎంసీల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఆయకట్టు పంటలు గట్టెక్కేందుకు మొత్తం 11టీఎంసీల నీటిని ఏడు విడుతల్లో విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు)కు గాను 1396.36 అడుగులు (7.89 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నదని, పది రోజుల అనంతరం రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలను ప్రారంభిస్తామని తెలిపారు
బోధన్ రూరల్, మార్చి 4: చివరి ఆయకట్టు వరకు నిజాంసాగర్ నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాలూర మండలంలోని ఫత్తేపూర్ గ్రామ రైతులు ఎండిపోతున్న పంటల సాక్షిగా సోమవారం నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, చివరి ఆయకట్టు వరకు ఒక చుక్క నీరు రాలేదన్నారు. సీఎం సార్ తమ పంటలకు నీళ్లు అందించాలని వేడుకున్నారు. స్థానిక ఏఈవో అపర్ణ ఎండుతున్న పంటలను పరిశీలించి, ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.