స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. దీంతో కూలీల అవసరం పెరిగింది. స్థానికంగా కూలీల కొరత ఏర్పడింది. ఇతర రాష్ర్టాల్లో ఉపాధి లేకపోవడంతో అక్కడి కూలీలంతా ఇక్కడికి వరుస కడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సాగు సంబురంగా కొనసాగుతున్నది. ఇతర రాష్ర్టాల కూలీలు ఉపాధి కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు తరలివస్తున్నారు. దుక్కులు దున్ని, నాట్లు వేసే దగ్గరి నుంచి ధాన్యం మోసే పనులు, పత్తి ఏరడం, పసుపు ఉడకబెట్టడం, శనగ నూర్పిడి తదితర పనుల్లో బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా అనేక రాష్ర్టాల కూలీలు పనులు చేస్తున్నారు. కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చి ఇక్కడ పనిచేస్తూ నిశ్చింతగా జీవిస్తున్నాయి. సొంత రాష్ట్రంలో రోజంతా పని చేసినా రూ.200 కూలీ దొరకదని, తెలంగాణలో రోజుకు సుమారు వెయ్యి వరకు సంపాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మహారాష్ట్ర కూలీలు, కామారెడ్డి జిల్లాకు వచ్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ కూలీలపై ప్రత్యేక కథనం
మోర్తాడ్, ఫిబ్రవరి 8: పసుపు పంట వచ్చిందంటే ఆర్మూర్ డివిజన్ ఒక కళ సంతరించుకుంటుంది. ఈ ప్రాంతం లో పసుపు పంటను రైతులు అధికంగా పండించడమే అందుకు కారణం. పసుపు పంట చేతికి వచ్చిందంటే పసుపు తవ్వకం నుంచి మార్కెట్కు తరలించే వరకు కూలీల అవసరం ఉంటుంది. పసుపు తవ్వకాల నుంచి ఉడకబెట్టేందుకు మహారాష్ట్ర నుంచి కూలీలు ఈప్రాంతానికి తరలివస్తారు. మహారాష్ట్రలోని నాందేడ్తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేల సంఖ్యలో కూలీలు డిసెంబర్ మాసంలోనే ఇక్కడికి వస్తారు. మా ర్చి వరకు ఇక్కడే ఉంటారు. దాదాపు మూడు వేలకు పైగా కూలీలు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తరలివస్తారని అంచనా.
పసుపు తవ్వకాల నుంచి పసుపును మార్కెట్కు తరలించే వరకు వివిధ రకాల పనుల కోసం మహారాష్ట్ర నుంచి నిజామాబాద్ జిల్లాకు దాదాపు మూడు వేలకు పైగా కూలీలు ఏటా తరలివస్తుంటారు. ఇక్కడి ప్రాంత రైతులతో సమాచారాన్ని అందుకొని కుటుంబాలతోసహా తరలివచ్చి నాలుగు నెలలపాటు ఇక్కడే ఉంటారు. పసుపు ఆవిరిపట్టే యంత్రాలు కలిగి ఉన్న రైతులు కూలీల గ్యాంగులను ఇక్కడికి రప్పిస్తారు. ఒక్కో గ్యాంగ్లో ఎనిమిది నుంచి పది మంది వరకు ఉంటారు. ఈవిధంగా ఆర్మూర్ డివిజన్లో దాదాపు మూడు వందల వరకు ఆవిరియంత్రాలు ఉంటాయి. దాదాపు మూడు వేల మంది కూలీలు ఈప్రాంతానికి తరలివస్తుంటారు. పసుపు ఉడకబెట్టే కూలీలను ఎక్కడ చూసినా మహారాష్ట్రకు సంబంధించిన వారే ఉంటారు. పసుపు సీజన్లో వచ్చిన కూలీలు ఒక్కొక్కరు కనీసం రూ.40-50వేల వరకు సంపాదించుకుని తిరిగి వెళ్తారు.
ఆవిరియంత్రం ద్వారా పసుపును ఉడకబెట్టే మహారాష్ట్ర గ్యాంగులకు డ్రమ్ము పసుపు ఉడకబెట్టినందు కు రూ.80 చెల్లిస్తారు. వీరు రోజుకు కనీసం 50 డ్ర మ్ముల పసుపును ఉడకబెడతారు. దీంతోపాటు పసుపు తవ్వకానికి వెళ్తుంటారు. సీజన్ ముగిసే వర కు కూలీలు ఇక్కడే ఉంటారు. వీరు గత 15సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి పసుపు సీజన్లో వస్తున్నారు.
మా గ్రామంలో కూడా కూలీ పనులే చేస్తుంటాం. పసుపు సీజన్ వచ్చిందంటే ని జామాబాద్ జిల్లాకు వస్తాం. పసుపు సీజన్ పూర్తయినంక తిరిగి వెళ్తాం. మాగ్యాంగ్లో ఎనిమిది మందిమి ఉన్నాం. ప్రతి రోజూ కనీసం రూ.500 ఒక్కో మనిషికి వచ్చేలా చూసుకుంటాం.
-కైలాస్, మహారాష్ట్ర కూలీ
మేము 15ఏండ్లుగా ఇక్కడికి వస్తున్నాం. మిషన్ ఓనర్ ఫోన్ చేయగానే ఇక్కడికి బయల్దేరుతాం. అందరం కలిసి పసుపును ఉడకబెట్టే పనులు చేస్తాం. ఒక్క డ్రమ్ము పసుపునకు రూ.80 ఇస్తారు. రోజుకు దాదాపు 50 డ్రమ్ముల పసుపును ఉడకబెడతాం. సీజన్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తాం.
– షబ్బీర్, మహారాష్ట్ర కూలీ